Hyderabad Theft: చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంటి కిటికీ నుంచి లోపలికి చొరబడ్డ దొంగ తాపీగా భోజనం చేసి ఫ్రిడ్జ్ లోని మామిడి పండ్లుతిని మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. బీరువా తెరిచి 75 తులాల బంగారు నగలు, 2.50లక్షల రూపాయల నగదును మూటగట్టుకుని ఉడాయించాడు.
స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మలక్ పేట రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంకు ఆనుకుని ఉన్న ఇంట్లో ఫహీముద్దీన్ కుటుబంతో కలిసి నివాసముంటున్నాడు. కొన్నేళ్లపాటు గల్ఫ్ లో పని చేసి వచ్చిన ఫహీముద్దీన్ ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నాడు.
Also read: AP Politics: సకల శాఖ మంత్రిగా లోకేష్ అవతారం!
ఇదిలా ఉండగా ఫహీముద్దీన్ భార్య సోదరి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. విషయం తెలిసి శుక్రవారం సాయంత్రం ఫహీముద్దీన్ భార్య సోదరి ఇంటికి వెళ్లింది. దాంతో ఫహీముద్దీన్ అతని కుమారుడు, కూతురు ఓ గదిలో నిద్రపోయారు. కాగా, అర్ధరాత్రి దాటిన తరువాత రైల్వే ఫ్లాట్ ఫాం వైపు ఉన్న కిటికీ తెరిచి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు.
ముందుగా ఫహీముద్దీన్ అతని పిల్లలు పడుకుని ఉన్న బెడ్ రూం తలుపులకు గడియ వేశారు. ఆ తరువాత వంటింట్లోకి వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఫ్రిడ్జ్ లో ఉన్న మామిడి పండ్లను కూడా తిన్నారు. ఆ తరువాత ఇంకో గదిలో ఉన్న బీరువా తెరిచి దాంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు తస్కరించి ఉడాయించారు.
శనివారం ఉదయం నిద్ర లేచిన ఫహీముద్దీన్ బెడ్ రూం తలుపులు తెరుచుకోక పోవటంతో కేకలు వేయగా ఇరుగుపొరుగు వచ్చి వాటిని తెరిచారు. చోరీ జరిగినట్టు తెలుసుకున్న ఫహీముద్దీన్ వెంటనే చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో క్లూస్ టీంతో వచ్చిన పోలీసులు నేర స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. ఇద్దరు దొంగలు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
రెండు ప్రత్యేక బృందాలు..
సంచలనం సృష్టించిన ఈ చోరీ కేసులో ఫహీముద్దీన్ కు తెలిసిన వారే నేరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో బంగారు నగలు పెద్ద మొత్తంలో ఉన్నాయని తెలిసి ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకోవటానికి రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Also read: Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!
మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ వారు ఫహీముద్దీన్ మొబైల్ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆ ఫోన్ ఆన్ చేసి ఉన్న నేపథ్యంలో ఐఎంఈ నెంబర్ ద్వారా లొకేషన్లు తెలుసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకోగలమన్న నమ్మకాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.