Free Diagnostic centres: కార్పొరేట్ వైద్యం ఖరీదు, సర్కారు వైద్యం నిర్లక్ష్యానికి మారుపేరుగా మారిన నేపథ్యంలో ఇకపై గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే అందనున్నాయి. ఇప్పటికే సుమారు 250 పై చిలుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రజల వైద్యకే వైద్యాన్ని తీసుకువచ్చిన జీహెచ్ఎంసీ(GHMC) ఇపుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆధునిక డయాగ్నస్టిక్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్ మాన్ భారత్ స్కీమ్(Ayushman Bharat Scheme) లో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తే నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్(MSU) ఏర్పాటుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజు రోజుకి జనాభా, పట్టణీకరణ పెరుగుతున్న హైదరాబాద్ మహా నగర వాసులకు మరింత అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)ను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలాలను కేటాయించింది.
యూనిట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దీంతో జీహెచ్ఎంసీ హరిహరకళాభవన్ లోని రెండున్నర వేల గజాల స్థలాన్ని చూపగా, అక్కడ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్(Metropolitan Surveillance Unit) ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే నారాయణగూడలోని ఇండియన్ ప్రివెంటీవ్ మెడిసిన్ (IPM) ఆవరణలో కూడా అందుబాటులో ఉన్న మరో రెండున్నర వేల చదరపు గజాల స్థలాన్ని ప్రతిపాదించగా, అక్కడ కూడా యూనిట్ ఏర్పాటు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ రెండు మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)లలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేలా అందుబాటులోకి తేనున్నట్లు బృందం వెల్లడించినట్లు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వెల్లడించారు.
వివిధ రకాల వ్యాధులను గుర్తించడం, ప్రజలను అప్రమత్తం చేయటం, వ్యాధుల లక్షణాలను ధృవీకరించడం, నమూనా సేకరణ, విశ్లేషణకు ఈ యూనిట్ సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) తరపున దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కార్యక్రమంలో ఈ యూనిట్ భాగం కానున్నట్లు వెల్లడించారు. ఈ రెండు యూనిట్ లకు కేంద్రం రూ.20 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం.
Also Read: Urfi Javed: ట్రోల్స్ చేసినవారికి ధీటుగా రిప్లై ఇచ్చిన ఉర్ఫీ జావెద్.. బొమ్మ అదిరిందిగా
బస్తీ దవాఖానాల్లోనూ శ్యాంపిల్స్ సేకరణ
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లోని సుమారు కోటి 26 లక్షల మంది జనాభాకు 30 సర్కిళ్లలో దాదాపు 256 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. కొన్ని వైద్య పరీక్షలకు బస్తీ దవాఖానాల్లో కూడా శ్యాంపిల్స్ సేకరిస్తున్నప్పటికీ, రిపోర్టులు వచ్చే సరికి కాస్త సమయం పడుతున్నందున, త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ద్వారా వైద్య పరీక్షలను వీలైనంత త్వరితగతిన నిర్వహించి, రిపోర్టులు అందజేసే అవకాశామున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే వైద్య పరీక్షలు అవసరమైన మహానగరవాసులు నేరుగా సికిందరాబాద్(Secunderabad), నారాయణగూడ(Narayanguda)ల్లో ఏర్పాటు చేయనున్న ట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్కు వచ్చే అవసరం లేకుండా, బస్తీ దవాఖానాల్లో శ్యాంపిల్స్ ఇస్తే చాలు, వారికి ఇరవై నాలుగు గంటల్లోనే వైద్య పరీక్షల రిపోర్టులు మళ్లీ బస్తీ దవాఖానాలకు వచ్చేలా ఈ యూనిట్ లు పని చేయనున్నట్లు సమాచారం. డైలీ వివిధ బస్తీ దవాఖానాల నుంచి వచ్చే శ్యాంపిల్స్ ను బట్టి ఈ యూనిట్ పని చేస్తుందని, వీలైతే మున్ముందు ప్రజలకు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించి నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.
300లకు పెరగనున్న బస్తీ దవాఖానాలు
ఢిల్లీ(Delhi) నగరంలో గల్లీ గల్లీలో వైద్య సేవలను అందిస్తున్న మోహల్లా దవాఖానాలపై 2017లో స్టడీ చేసిన జీహెచ్ఎంసీ(GHMC) 2018 నుంచి సిటీలో బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చింది. తొలుత జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న వైద్య సేవలందించిన బస్తీ దవాఖానాలను ఇపుడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థోపెడిక్ సేవలను అందించే స్థాయికి ఎదిగాయి. ప్రస్తుతం 256 వరకున్న బస్తీ దవాఖానాల సంఖ్యను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 300 లకు పెంచేందుకు అవసరమైన సహాయ సహకారాలను కూడా అందించేందుకు ఆయుష్ మాన్ భారత్ ప్రతినిధుల బృందం సుముఖతను చూపినట్లు సమాచారం.
Also Read: Anil Ambani: చోటా అంబానీకి దెబ్బ మీద దెబ్బ.. ఇక కష్టమే!