Hajj: మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హజ్ యాత్రకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, అనుబంధ శాఖల అధికారులు మెరుగైన సదుపాయాలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. హైదరాబాద్ హజ్ హౌస్ లో హజ్ యాత్రపై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. హజ్ యాత్రలో భాగంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అలాగే మరి కొన్ని రాష్ట్రాల నుండి 11 వేల మందికి పైగా హజ్ యాత్ర చేయనున్నట్లు తెలిపారు.
ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని శాఖల అధికారులు చేపట్టే అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం హజ్ యాత్రను అత్యంత ప్రాధాన్యతిస్తుందని, ఆ దిశగా అధికారులు నిబద్ధత, సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా యాస్మీన్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేయాలని,హజ్ యాత్ర సందర్బంగా యాత్రికులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి విమానాలు ఈ నెల 29 నుండి మే 29, 2025 వరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Also Read: GHMC Staff Recruitment: జీహెచ్ఎంసీ సిబ్బంది భర్తీ.. కొత్త నియామకాలతో సమస్యలు తీరేనా?
మదీనాకు ఏప్రిల్ 29 నుండి మే 13 వరకు,అలాగే జిద్దాకు మే 16 నుండి మే 29 వరకు విమానాలు నడుస్తాయని తెలిపారు. జిద్దా నుండి తిరిగి వచ్చే విమానాలు జూన్ 12 నుండి జూలై 9 మధ్య నడుస్తాయని, 31 విమానాలు యాత్రికులకు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. యాత్రికులు తమ నిర్ణీత రిపోర్టింగ్ సమయాలను ఖచ్చితంగా పాటించాలని, విమాన షెడ్యూల్లో ఎటువంటి మార్పులు అనుమతించబడవని ఆమె స్పష్టం చేశారు.
టీజీఆర్టీసీ రవాణా కోసం తగిన సంఖ్యలో బస్సులను సమకూర్చాలని, అత్యవసర పరిస్థితుల కోసం మరి కొన్ని వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఎస్బీఐ బ్యాంక్ రేట్లతో యాత్రికుల కరెన్సీ మార్పిడి సౌకర్యం కల్పించాలని, ఎస్బీఐ యాత్రికులకు బ్యాగ్ పౌచ్, కరెన్సీ సేవలను ఉపయోగించే వారికి రూ.10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న యాత్రికులు ధృవీకరణ తర్వాత ఎస్బీఐ కౌంటర్లో చెల్లింపులు చేయవచ్చని సూచించారు.
Also Read: Mahesh Kumar Goud: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి.. పిసిసి చీఫ్ అభివృద్ధి పై దృష్టి!
సమయానికి వెళ్లలేని వారికోసం సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ నుండి ఎంబార్కేషన్ పాయింట్లకు రైలు రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. హజ్ హౌస్ లో ఏర్పాటు చేయనున్న స్టాల్స్ షామియానాలలో జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త సేకరణ, పరిశుభ్రత కోసం డస్ట్బిన్లు అలాగే స్కావెంజింగ్ సేవలను నిరంతరం కొనసాగాలని సూచించారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో హజ్ హౌస్లోని 20 గదులకు నీటి సరఫరా, సీనరేజ్ నిర్వహణను సేవలను అందించాలని ఆదేశించారు.
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా స్థాయి డీస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, ఏరియా హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్లను నిర్వహించాలని, హజ్ హౌస్లో హెల్త్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ఆధునాతన అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ నిరంతరం విద్యుత్ సరఫరా, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు, లిఫ్ట్ ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ,ఐఎస్డీ టెలిఫోన్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ సీసీటీవీ నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ చేపట్టాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సజ్జాద్ అలీ తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు