Ganesh Immersion 2025: భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుంటున్న గణనాధుల విగ్రహాల నిమజ్జనం కోసం సర్వం సిద్దం చేసినట్లు జీహెచ్ఎంసీ(Ghmc) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(R.V. Karnan) స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా,ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ(Ghmc) కమిషనర్ నెక్లెస్ రోడ్డు మార్గంలో పీపుల్స్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ పార్క్ బతుకమ్మ కుంట, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్ లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
Also Read: Hydraa: బతుకమ్మ కుంట పునరుద్ధరణలో వేగం పెంచండి
200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం
బ్యారికేడింగ్, లైటింగ్, క్రేన్ ల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులను కూడా సిద్దం చేశామన్నారు. నిమజ్జనం సాఫీగా చేసేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకు అవసరమైన నిధులను జీహెచ్ఎంసీ కేటాయించిందని వివరించారు. నగరంలోని అన్ని ప్రధాన లేక్ లలో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్ లు ఏర్పాటు చేశామన్నారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీమ్ లను, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి, 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు రూట్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా సాగేందుకు వీలుగా 160 గణేష్ యాక్షన్ టీమ్ లను అందుబాటులో ఉంచామన్నారు.
14 వేల 486 మంది శానిటేషన్ కార్మికులు
నిమజ్జనంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసి, అత్యంత ప్రాధాన్యతనిస్తూ 14 వేల 486 మంది శానిటేషన్ కార్మికులు మూడు షిఫ్టులలో విధులను నిర్వర్తించనున్నట్లు కమిషనర్ తెలిపారు. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 జీసీబీ లు, 102 మినీ టిప్పర్ లు ఉపయోగించి 3000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి డంప్ యార్డుకు తరలించామని వివరించారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాలలో 39 మొబైల్ టాయిలెట్లు, నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56 వేల 187 టెంపరరీ లైటింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్ లతో సహా 7 మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 90 శాతం కు పైగా గుంతలను పూడ్చివేశామని, వర్షాలతో దెబ్బతిన్న మిగతా గుంతలను ఇంజనీరింగ్ విభాగం పూడ్చుతున్నట్లు కమిషనర్ తెలిపారు.
Also Read: Kaleshwaram CBI Probe: కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడంపై బండి సంజయ్ ఏమన్నారంటే?