Fire Accident Hyderabad: హైదరాబాద్ సిటీలో ఒకేసారి రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. సమాచారం అందగానే హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాయి. ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలను హైడ్రాకు చెందిన 5 డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశాయి. అమీర్పేట, సారథీ స్టూడియో సమీపం, 5 అంతస్తుల దివ్యశక్తి అపార్టుమెంట్లోని రెండో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది.
అగ్ని టెక్నో స్క్రిప్ట్ క్రియేషన్స్ డబ్బింగ్ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరగగా, అందులో పని చేస్తున్న రాజేష్ చౌదరి (25)ని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఏసీ యూనిట్ కంప్రషర్ పేలడంతో మంటలు వ్యాపించి మధ్యాహ్నం మూడున్నర గంటలకు అగ్ని ప్రమాదం ఏర్పడినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.హైడ్రా కంట్రోల్ రూమ్కు ఫోను రాగానే స్థానిక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మోహన్రావును అప్రమత్తం చేయగా, తన వద్ద ఉన్న రెండు బృందాలతో కలిసి వెళ్లి మంటలు వ్యాప్తి చెందకుండా నిలువరించారు.
Also Read: Swetcha Special story: చదువే జీవన గమనాన్ని మార్చుతుంది.. ఎస్పీ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!
ఈ లోగాజూబ్లీహిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడకు చేరుకున్నాయి. మంటల వ్యాప్తికి డబ్బింగ్ స్టూడియో సగానికి పైగా కాలిపోయి పొగలు కమ్మాయి. ఈ మంటలు పై అంతస్తులకు చేరకుండా పూర్తిగా ఆపేశారు. ఇదంతా గంట వ్యవధిలోనే పూర్తి చేశారు. డబ్బింగ్ థియేటర్లో ఓనర్ కిషోర్తో పాటు అందులో పనిచేస్తున్న రాజేష్ చౌదరి ఉన్నారు. కిషోర్ అప్పటికే బయటకు రాగా, స్టూడియోలో చిక్కుకున్న రాజేష్ను ల్యాడర్ ద్వారా పైకి వెళ్లిన డీఆర్ ఎఫ్ సభ్యుడు శ్రీకాంత్ రాజేశ్ ను చాకచక్యంగా కాపాడారు.
పటాన్చెరులో తప్పిన పెను ప్రమాదం
పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పాటి గ్రామంలో అనే ఫర్నీచర్ గోదాంలో కూడా అగ్ని ప్రమాదంజరిగింది. ప్రమాదం కూడా శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సంభవించింది. ఈ సమాచారాన్ని హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్రావు హుటాహుటిన 3 హైడ్రా బృందాలతో అక్కడకు చేరుకుని మంటల వ్యాప్తి చెందకుండా నిలువరించారు. ఫర్నీచర్ తయారీ కేంద్రంలో ఐరన్ ఫ్రేమ్కు వెల్డింగ్ చేస్తుండగా, నిప్పురవ్వలు ఫోమ్ మెటీరియల్పై పడి మంటలు అంటుకున్నట్లు హైడ్రా గుర్తించింది. పక్కనే ఉన్న గోదాముకు కూడా మంటలు వ్యాపించడంతో ఫర్నీచర్ మొత్తం మంటల్లో కాలిపోయింది.
భారీ ఎత్తున ఎగిసి పడిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు చాలా సేపు శ్రమించి జీ ప్లస్ 3గా ఉన్న ఈగోదాము భవనం చుట్టూ ప్రహరీ ఉండడంతో మంటలు వేరే భవనాలకు అంటుకునే ప్రమాదం కొంతవరకు తప్పింంచింది. కూకట్పల్లి, మాధాపూర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలనార్పడంలో తోడ్పడినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. మాధాపూర్ బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చింది. గంటన్నరలో మంటలను అదుపులోకి తెచ్చినట్టు రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, ఎస్ ఎఫ్ వో సతీష్రావు తెలిపారు.
Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!