DGP Jithender: డ్రగ్స్ కేసుల్లో పకడ్భంధీగా దర్యాప్తు చేయటం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చూడాలని డీజీపీ జితేందర్ సూచించారు. అప్పుడే మాదక ద్రవ్యాల దందా చేస్తున్నవారిలో భయం నెలకొంటుందన్నారు. తద్వారా డ్రగ్స్ కు చెక్ పెట్టవచ్చని చెప్పారు.
డీజీపీ కార్యాలయంలో నార్కొటిక్ బ్యూరో సిబ్బందితో సమావేశమైన డీజీపీ జితేందర్ విధుల నిర్వర్తనలో ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందికి రివార్డులు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ దందా..వినియోగాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం నార్కొటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు.
AlSO Read: Rahul Gandhi Speech: పాత తరానికి వీడ్కోలు, కొత్త నాయకత్వానికి స్వాగతం.. రాహుల్ గాంధీ!
ప్రత్యేకంగా ఇలా బ్యూరో ఏర్పాటు చేయటం దేశంలోనే మొదటిసారి అని చెప్పారు. పద్దతి ప్రకారం దర్యాప్తు జరిపి పక్కాగా సాక్ష్యాలు సేకరించి ఆయా న్యాయస్థానాల్లో ఛార్జీషీట్లు దాఖలు చేస్తే ఈ కేసుల్లోని నిందితులకు 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు పడతాయన్నారు.
అలా జరిగితేనే డ్రగ్స్ దందా చేస్తున్న వారిలో భయం పుడుతుందని చెప్పారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ దర్యాప్తులోని లోపాలను అవకాశంగా చేసుకుని నిందితులు కేసుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఇవ్వొద్దని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ పద్దతిన కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు.
Also Read: Ponnam Prabhakar: విద్యతో విజయాన్ని సాధించండి.. విద్యార్థులకు మంత్రి సూచన!
అదనపు డీజీ అనిల్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువకులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని కోసమే నార్కొటిక్ బ్యూరోను ఏర్పాటు చేశారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది మరింత అంకిత భావంతో పని చేయాలన్నారు.
నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ దందా చేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికి నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 1908 నెంబర్ కు ఫోన్ చేసి డ్రగ్స్ వ్యాపారం, వినియోగం జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నార్కొటిక్ బ్యూరో ఎస్పీల రూపేశ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు