- ఆదివాసీల హక్కులే ముఖ్యం!
- ఆ దిశగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- వన్య ప్రాణులకు ప్రాముఖ్యతనిస్తూ 2016 నుంచి ఎన్నో ప్రొసీడింగ్స్
- తప్పని పరిస్థితుల్లో 49 జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం
- 360 గ్రామాలకు ముప్పు రావడంతో సీఎం గట్టి నిర్ణయం
- అన్నీ చట్టాలతో పోల్చితే ఆదివాసీల హక్కులే ముఖ్యమన్న ముఖ్యమంత్రి
- సీఎం నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీల పండుగ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్
GO 49: కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49 సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నిలిపివేశారు. సీఎం ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం సోమవారం మోమో జారీ చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కొండా సురేఖ భేటీ అయ్యారు. జీవో 49పై నివేదించారు. సీఎం సానుకూలంగా స్పందించి నిలుపుదల చేశారు. దీంతో మంత్రులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
అసలేంటీ వివాదం.. ఎప్పుడు మొదలైంది?
తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లను కలిపేందుకు వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కన్సర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేయాలని 2016లోనే బీజం పడింది. 2016 జూన్ 12న దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మొదటి సమావేశం, ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్సర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలనే ప్రతిపాదనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చించింది. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 27న రాష్ట్ర వన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్ కోసం చర్యలు చేపట్టింది. 2018 జూన్ 26న చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపాదిత ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2019 జూలై 11న కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్కు అనుబంధంగా ప్రతిపాదిత ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్సర్వేషన్ జోన్గా ప్రకటించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ గుడెం నగేష్, బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మద్దతుతో 2024 జూలై 10న ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. అనుగుణంగా తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వులను కలిపేలా వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తూ జీవో 49 జారీ అయింది.
Read Also- Liquor Scam Case: లిక్కర్ కేసులో వైఎస్ జగన్ అరెస్ట్కు బ్రేక్ పడిందా?
జీవోపై అభ్యంతరాలు
ఈ జీవో పట్ల స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్లో 2025 జూన్ 10న సమావేశమై జీవో 49ను నిలిపి వేయాలని తీర్మానం చేశారు. సీఎంను ప్రత్యేకంగా కలిసి స్థానిక ప్రజల ఆకాంక్షలను వివరించారు. మరోవైపు, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క అటవీ అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో 2025 జూలై 3న సమావేశమై మరోసారి చర్చించి జీవో 49ని నిలుపుదల చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి జీవోను నిలిపుదల చేసేలా ఒప్పించారు. జీవో 49పై స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకే ముందుకు వెళ్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజనులకు ఎటువంటి ఆందోళన వద్దని, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెప్పారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తదితరులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు, మంత్రులకు కృతజ్ఞతలు
కేంద్రం ఒత్తిడితో ఆదిలాబాద్లో జీవో 49 తీసుకురావడంపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్యే హెడ్మా బొజ్జు అన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సీఎంకు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ రిపోర్ట్ ఇచ్చారన్నారు. జూపల్లి కృష్ణారావు ఆనాడే సమావేశం పెట్టి జీవో రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. జీవో రద్దుకు సహకరించిన మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, జీవోను నిలిపివేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ, జీవో 49 వల్ల ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం వల్లే ఈ జీవో విడుదల అయిందని చెప్పారు. ఆదివాసీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
Read Also- Vice President: కాబోయే ఉపరాష్ట్రతి ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచేనా?