- తిమ్మిని బమ్మిని చేస్తున్నట్టు సుప్రీం ఆగ్రహం
- కేసు ఏదైనా శ్రీధర్ రావు డబ్బులతో ఎర
- వ్యవస్థలను భ్రష్టు పటిస్తున్న వైనం
- అధికారం ఉన్న లీడర్ల అండతో అడ్డదారులు
- రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్య పిటిషన్తో బయటపడ్డ అసలు రంగు
- అక్రమ అరెస్ట్పై సుప్రీంకోర్టు చివాట్లు
- సివిల్ కేసులో పోలీసులను మేనేజ్ చేసినందుకు ఆగ్రహం
- అరెస్ట్ చేయించినందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని సంధ్య టెక్నోకు ఆదేశం
- సైబరాబాద్ కేసులో కొడుకును తప్పించి గిరిజన బిడ్డను ఇరికించారు
- ట్విన్ సిటీలో ఉన్న అధికార ఎమ్మెల్యే చేత 10 కేసుల దాకా రద్దు
- ఒత్తిడికి దాసోహమన్న మాదాపూర్ అదనపు డీసీపీ
- సంధ్య బ్రాండ్తో సిస్టంను నాశనం చేస్తున్న తీరుపై ‘స్వేచ్ఛ’ కేస్ స్టడీ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్
Sandhya Sridhar: ఈ నెల 18న (సీసీ నెం. 3613 ఆఫ్ 2021) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ పోలీసుల పనితీరుకు అద్దం పడుతున్నది. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ కాలనీలో ఉన్న రిటైర్డ్ ఆర్మీ కుటుంబానికి చెందిన 500 గజాల భూమిని, డిల్లీలోని ఫాంహౌజ్ను విక్రయించడానికి ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని గచ్చిబౌలిలో పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. సంధ్య టెక్నో ఉద్యోగి ఫిర్యాదుతో ఐపీసీ 406, 420 సెక్షన్స్పై కేసు పెట్టారు. అయితే, సివిల్ కేసులో సంధ్య టెక్నో ఓనర్ శ్రీధర్ రావు పోలీసులను మేనేజ్ చేసి క్రిమినల్ ఇంటెన్షన్ చూపించి 70 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్య మాలా చౌదరిని వారం రోజులు జైల్లో ఉంచిన తీరును సుప్రీంకోర్టు తప్పు బట్టింది. సాదా సీదా కేసులో అధికార దుర్వినియోగం చేయడం వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నందుకు రూ.10 లక్షలు న్యాయం కోసం అప్పీల్కు వచ్చిన వృద్ధురాలికి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, మాలా చౌదరి కానీ తన కుమార్తె గానీ ఎప్పుడు తెలంగాణ వచ్చినా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సంధ్య టెక్నో ఓనరైన సరనాల శ్రీధర్ రావు పోలీస్ వ్యవస్థను డబ్బులతో మేనేజ్ చేస్తూ, సామాన్యులను ఎలా ఇబ్బంది పెడుతున్నాడో తేలిపోయింది. కోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చి సిస్టమ్ను తనకు అనుకూలంగా మార్చుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇతని లీలలపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి.
తప్పు ఒప్పుకుని తప్పించుకుని.. అమాయకుడిని బలి చేశారు
గతేడాది డిసెంబర్లో సైబరాబాద్ సీపీ మహంతికి ఒక ఫిర్యాదు అందింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన (968 ఆఫ్ 2023, 975 ఆఫ్ 2023) కేసు ఇది. డిసెంబర్ 5న కోనేరు రమేష్ రాయదుర్గం నుంచి జూబ్లీహిల్స్కు వెళ్తున్నాడు. వెనుక నుంచి ఓ కారు వచ్చి నాలుగు సార్లు ఢీ కొట్టింది. ఆ తర్వాత ముందుకు వచ్చి వాహనాన్ని అడ్డుపెట్టారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఇదంతా చేసింది సీసీ కెమెరాల ఆధారంగా సరనాల మురళీధర్(శ్రీధర్ రావు కుమారుడు) అని తెలిసింది. అన్ని ఆధారాలతో రాత్రి 9 గంటలకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మురళీధర్పై 341, 352, 427, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్పై కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు అయిందని తెలుసుకున్న నిందితుడు కౌంటర్ ఫిర్యాదు (క్రైం నెం. 975 ఆఫ్ 2023) మూడు రోజుల తర్వాత చేశాడు. ఇందులో తనను రెచ్చగొట్టినందుకు గొడవపడ్డాను, అద్దాలు పగులగొట్టాను అని ఒప్పుకున్నాడు. అయినా పోలీసులు 341, 427, 506 సెక్షన్స్పై మొదటి ఫిర్యాదు దారుడిపై కౌంటర్ కేసు నమోదు చేశారు. ట్విస్ట్ ఏంటంటే, కొద్ది రోజుల్లోనే కౌంటర్ పిటిషన్ వాపస్ తీసుకున్నారు. మొదట ఫిర్యాదు చేసిన కేసులో నిందితుల జాబితాలో ఏ1 లేడు. సంధ్య శ్రీధర్ దగ్గర డ్రైవర్గా పనిచేసే లంబాడా యువకుడు కాటాయల సాయి కుమార్ను నిందితుడిగా చేర్చుతూ చార్జ్షీట్ దాఖలైంది. సీసీ ఫుటేజ్లో ఎక్కడా సాయి కుమార్ లేడు. గొడవపడి బీభత్సం సృష్టించిన అసలు నిందితుడిని తప్పించి, మహబూబ్నగర్కు చెందిన అమాయక గిరిజన బిడ్డను ఇరికించారు. ఈ కేసును తారుమారు చేయడానికి రంగారెడ్డికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పదే పదే అడిషనల్ డీసీపీకి ఫోన్స్ చేసి చార్జ్షీట్లో మురళీధర్ పేరు లేకుండా నిందితుడిని మార్చేశారని సీపీకి అందిన ఫిర్యాదులో ఉన్నది. దీనిపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి దర్యాప్తు మొదలు పెట్టలేదు.
Read Also- BJP: బీజేపీ ఎంపీలకు ఫ్రీ హ్యాండ్.. ఇప్పుడైనా చెక్ పడుతుందా?
ఎమ్మెల్యేకు హోంమంత్రి పదవి ఇప్పిస్తానని బడాయి మాటలు
తనకు 40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఎన్ని వందల కోట్లు ఖర్చైనా నీకు హోంమంత్రి పదవి వచ్చేలా చేస్తానని ట్విన్ సిటీలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని శ్రీధర్ రావు బురిడీ కొట్టిస్తున్నట్టు ప్రచారం ఉన్నది. అందుకు సదరు ఎమ్మెల్యే అన్ని విధాలా సహకరించడంతో పాటు అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచడంతో శ్రీధర్ రావుపై ఉన్న 42 కేసుల్లో 10 కేసులు రద్దు చేసినట్లు డిపార్ట్మెంట్లో చర్చ ఉన్నది. రిటైర్డ్ అయ్యేందుకు దగ్గరగా ఉన్నావు, ఇప్పుడే ఏదైనా చేసుకోవచ్చు అని అదనపు డీసీపీకి మాయ మాటలు చెప్పి సామాన్యులపై కేసులకు ఉసిగొల్పి, తనపై ఉన్న కేసులను రద్దు చేయించుకుంటున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా రిపోర్ట్ ఉన్నది.
తల్లి పేరుతో కోర్టులో తప్పుడు పిటిషన్
అక్రమంగా ఇతరుల ఆస్తులు కబ్జా చేసుకునేందుకు శ్రీధర్ రావు ఎంతటికైనా తెగిస్తాడని బిజినెస్ సర్కిల్లో పేరు ఉన్నది. ఓ ప్లాట్ విషయంలో తన తల్లి పేరుపై లేకుండానే హైకోర్టులో కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇలా ఒక వ్యక్తి వ్యవస్థలను తన మాయ మాటలతో అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి సిస్టమ్ను తప్పుదారి పట్టిస్తున్నాడని అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు తీర్పే అందుకు నిదర్శనం. ఇవే కాకుండా కేసులు వేస్తానని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడంలోనూ ఇతను ఆరి తేరినట్టు తెలుస్తున్నది.
Read Also- Natti Kumar: ఫిష్ వెంకట్కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!