Actor Arya: కేరళకు చెందిన నటుడే అయినప్పటికీ పలు తమిళ బ్లాక్ బాస్టర్ మూవీస్లో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఆర్యకు (Actor Arya) ఆదాయ పన్ను విభాగం (IT Raids) అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. చెన్నైలోని అతడి నివాసంలోకి ప్రవేశించిన ఐటీ అధికారులు, ఆకస్మిక దాడులు చేశారు. ఆర్యకు చెందిన ‘సీ షెల్ రెస్టారెంట్ల’లో కూడా బుధవారం (జూన్ 18) తెల్లవారుజాము నుంచి అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. నగరంలోని అన్నా నగర్, వేలాచేరితో పాటు పలు బ్రాంచ్ల రెస్టారెంట్లలో దాడులు కొనసాగుతున్నాయి. సీ షెల్ రెస్టారెంట్లతో ఆర్యకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. ఐటీ దాడులకు రెస్టారెంట్ల వ్యవహారాలే కారణం కావొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా నగర్ బ్రాంచ్లోనే ఐదుగురి కంటే ఎక్కువ మంది ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఐటీ అధికారులు రెండు వాహనాల్లో రాగా, వారికి రక్షణగా పోలీసులను కూడా మోహరించారు. నగరంలో హైప్రొఫైల్ రెస్టారెంట్లు కావడం, ఆర్యకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉండడంతో ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి.
Read this- PM Modi: ఆమెను మళ్లీ కలిసిన మోదీ.. ఫొటో తెగ వైరల్
ఐటీ అధికారులు ఆర్య నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. చెన్నైలోని పూనమల్లి హై రోడ్లో ఉన్న అతడి నివాసంతో పాటు పలు రెస్టారెంట్లలో ఏకకాలంలో ఈ దాడులు చేశారు. ఆర్య సొంతంగానే రెస్టారెంట్ను ప్రారంభించినప్పటికీ, కొన్నేళ్ల క్రితమే కేరళలోని తలస్సేరీకి చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్టు సమాచారం. అయితే, కేరళలోని కున్హి మూసా ఆస్తులు ఐటీ విభాగం పర్యవేక్షణలో ఉన్నాయి. దీంతో, ఆర్య నివాసంలో ఐటీ దాడులకు రెస్టారెంట్లే కారణం కావొచ్చని, రెస్టారెంట్ బిజినెస్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, యాజమాన్య చరిత్రపై విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిపి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read this- Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?
తమిళ చిత్రాలతో పాపులారిటీ
నటుడు ఆర్య పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ‘అరింథం అరియమాలం’ అనే హిట్ సినిమాతో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఘనమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత పట్టియల్, నాన్ కడవుల్, మద్రాసపట్టణం, బాస్ ఎంగిర భాస్కరన్, అవన్ ఇవాన్, వెట్టై, రాజా రాణి, ఆరంభం వంటి హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తొలినాళ్లలో తన స్నేహితులతో కలిసి కొన్ని మలయాళ చిత్రాలను నిర్మించాడు. ఆ తర్వాత పలు తమిళ సినిమాలను కూడా నిర్మించాడు. తన క్లోజ్ ఫ్రెండ్ సంతానంతో కలిసి ఇటీవలి నిర్మించిన ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆర్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్టువం’తో పాటు ‘మిస్టర్ ఎక్స్’, ‘ఆనంధన్ కాదు’ మూవీస్లో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సంప్రదింపులు కూడా జరుపుతున్నాడు. వాటిపై క్లారిటీ రాావాల్సి ఉంది.