Richest Indians: ప్రస్తుత సంవత్సరం 2025కి సంబంధించి భారతదేశంలో సంపన్న వ్యక్తుల జాబితా (Richest Indians list) విడుదలైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం మరోసారి దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ముకేష్ అంబానీ కుటుంబ ఆస్తి విలువ అంచనా ఏకంగా రూ.9.55 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు ‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025’ 14వ ఎడిషన్ రిపోర్టు బుధవారం వెలువడింది. ఈ రిపోర్టు ప్రకారం, మొత్తం రూ.8.15 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది.
రిచెస్ట్ ఉమెన్గా రోష్నీ నడార్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ప్రముఖ బిజినెస్మెన్ శివ్ నడార్ కూతురు రోష్నీ నడార్ మల్హోత్రా అవతరించారు. నడార్ కుటుంబం టాప్-3లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. వీరి కుటుంబ ఆస్తి నికర విలువ రూ. 2.84 లక్షల కోట్లుగా ఉంది. రోష్నీ నడార్ ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ కంపెనీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
వేగంగా పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య
‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025’ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో బిలియనీర్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2025లో బిలియనీర్ల సంఖ్య 350 దాటింది. 13 ఏళ్లక్రితం హురున్ రిచెస్ట్ లిస్ట్ మొదలైన నాటితో పోల్చితే 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోని మొత్తం బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ. 167 లక్షల కోట్లుగా ఉంది. భారతదేశ జీడీపీలో సగానికి సమానంగా వీరి ఆస్తి ఉంది.
Read Also- US shutdown: అమెరికా ప్రభుత్వం షట్డౌన్.. విమాన, రైలు సర్వీసులు నిలిచిపోతాయా?
దూసుకొస్తున్న యువపారిశ్రామికవేత్తలు
ధనార్జన విషయంలో దేశంలో యువ పారిశ్రామికవేత్తలు దూసుకెళుతున్నారు. పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ రూ.21,190 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలో అతి చిన్న బిలియనీర్గా నిలిచారు. ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలే కావడం విశేషం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా తొలిసారి బిలియనీర్ల జాబితాలో అడుగుపెట్టాడు. ఆయన సంపద నికర విలువ రూ. 12,490 కోట్లు అని హురున్ రిపోర్ట్ అంచనా వేసింది. దేశంలో జనాదరణ కలిగిన వ్యక్తులు వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారనడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.
సంపద పెరుగుదలలో బజాబ్ ఫ్యామిలీ టాప్
సంపద పెరుగుదల విషయంలో బజాజ్ గ్రూపునకు చెందిన నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో వారి కుటుంబ నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 69,875 కోట్ల మేర పెరిగింది. దీంతో, మొత్తం ఆస్తి విలువ రూ. 2.33 లక్షల కోట్లుకి ఎగబాకింది. భారతదేశంలో వేర్వేరు రంగాలలో సంపన్నుల ఎదుగుదలను ఈ జాబితా ప్రతిబించిస్తోంది.
Read Also- Festive Trains: దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే గుడ్న్యూస్.. ప్యాసింజర్లకు ఇక పండుగే!
బిలియనీర్స్కు అడ్డాగా ముంబై
భారతదేశంలోని బిలియనీర్స్ ఎక్కువ మంది ముంబైకి చెందినవారేనని ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది. ముంబైలో అత్యధికంగా 451 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ముంబై తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీలో 223 మంది, బెంగళూరులో 116 మంది నివాసం ఉంటున్నారు. రంగాలవారీగా గమనిస్తే, అత్యధికంగా ఫార్మాస్యూటికల్స్ (ఔషధ రంగం) ముందంజలో ఉంది. ఈ రంగం నుంచి 137 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగంలో 132 మంది, కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగంలో 125 మంది బిలియనీర్లు ఉన్నారు.