VC Sajjanar: సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు సొంతూర్లకు వెళ్లి తమ ఆత్మీయులతో పండుగ జరుపుకునేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్లు, బస్సుల ద్వారా తమ ఊర్లకు వెళ్లేందుకు కొందరు ఇప్పటికే టికెట్లను బుక్ చేసుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులను సైతం ఆర్టీసీ (TGSRTC) అందుబాటులోకి తీసుకొస్తొంది. అలాగే రైల్వే శాఖ (Indian Railway) కూడా సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే టికెట్లు దొరకపోవడం, టికెట్ ధరలు అధికంగా ఉండటంతో కొందరు సొంత వాహనాల్లో సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటువంటి వారికి హైదరాబాద్ సిటీ కమిషనర్ వి.సి. సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
పొగమంచుతో జాగ్రత్త..
‘పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి’ అనే క్యాప్షన్ తో వి.సి. సజ్జనార్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారిందన్నారు. ఎదురుగా ఏముందో కనిపించని స్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు. సొంతవాహనాల్లో పండక్కి వెళ్లేవారు పొగమంచులో అస్సలు ప్రయాణం చేయవద్దని సజ్జనార్ సూచించారు.
అర్ధ రాత్రి, తెల్లవారుజామున వద్దు..
పండగ సమయాల్లో ఉండే ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు కొందరు తెల్లవారుజామున లేదా రాత్రివేళల్లో సొంతూర్లకు బయలుదేరుతుంటారు. అలాంటి వారికి కూడా సజ్జనార్ కీలక సూచనలు చేశారు. మంచు ప్రభావం అధికంగా ఉండే ఈ సమయాల్లో సాహసాలు చేయవద్దని హితవు పలికారు. పొగమంతు పూర్తిగా తగ్గి.. రోడ్లు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభియాలని విజ్ఞప్తి చేశారు. మీ రాక కోసం మీ కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారని.. వారి కళ్లల్లో ఆనందాన్ని నింపాలి గానీ, కన్నీళ్లను కాదు అంటూ సజ్జనార్ చెప్పుకొచ్చారు.
Also Read: CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో పొగమంచులోనే బయలుదేరాల్సి వచ్చినవాళ్లకు సజ్జనార్ కొన్ని జాగ్రత్తలు సూచించారు. పొగమంచులో వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేసి ఉంచాలన్నారు. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించాలన్నారు. రోడ్డు ఖాళీగా ఉందని కదా అని ఎట్టి పరిస్థితుల్లో వేగంగా వెళ్లవద్దని హైదరాబాద్ సీపీ హితవు పలికారు. ఒక్క ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని.. ఆలస్యంగానైనా క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ అంటూ సజ్జనార్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!
సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో… pic.twitter.com/esYAMfcz8O
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 9, 2026

