CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం
CM Revanth Reddy ( image credit: swetcha reporter)
Political News

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ములుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు.  గాంధీ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు మొదలు, సర్పంచ్ ఎన్నికల వరకు కార్యకర్తలంతా కాంగ్రెస్ జెండాను ఎగుర వేసేందుకు శ్రమించారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో పని చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు క్షేత్రస్థాయి కార్యకర్తల కోసం పని చేయాలన్నారు.

అన్ని చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో 8 ఏళ్ల పాటు ఉంటుందని సీఎం అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకున్నదని, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. కార్యకర్తల గెలుపు కోసం తాను కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని, పార్టీకి తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడిందని వివరించారు.

Also Read: CM Revanth Reddy: పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై.. సీఎం కీలక నిర్ణయం!

రాహుల్ ప్రధాని కావాలి

ప్రస్తుతం దేశం ఇబ్బందుల్లో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ (Revanth Reddy) అన్నారు. దీని కోసం తెలంగాణ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మోదీని ఓడించి రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం అంతా కష్టపడి పని చేయాలన్నారు.

ఉపాధి హామీ ఎత్తివేసే కుట్రలను అడ్డుకోవాలి

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని సీఎం తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో 80 శాతం మంది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా ఉన్నట్లు గుర్తు చేశారు. చట్ట సభల్లో బలం ఉన్నదని మోదీ ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. వెట్టి చాకిరీని నిర్మూలించి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి, ఓటు హక్కు ఇచ్చింది మహాత్మా గాంధీ, అంబేద్కర్ అంటూ వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో పేదల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. ఈ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయని గుర్తు చేశారు. అంబానీ, అదానీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించడానికే ఉపాధి హామీలో మార్పులు చేస్తున్నారన్నారు. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీల కుట్ర ఉన్నదని విమర్శించారు.

మోదీతో క్షమాపణలు చెప్పిస్తాం

గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారని, వాటికి వ్యతిరేకంగా గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొట్లాడారని రేవంత్ గుర్తు చేశారు. దేశ రైతులకు మోదీ క్షమాపణ చెప్పి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంలో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ పేరులోనే గందరగోళం ఉన్నదని, దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామన్నారు. దేశానికి ఈ విషయంలోనూ మోదీతో క్షమాపణలు చెప్పిస్తామన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. అందుకే ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని నొక్కి చెప్పారు.

400 సీట్లు వస్తే ఖతమే

రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని ఈ సందర్భంగా రేవంత్ మండిపడ్డారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేసిందన్నారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారని వివరించారు. అదానీ, అంబానీకి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. ఓటు ప్రక్షాళన అంటూ ‘సర్’ అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, పేదలు, మైనార్టీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. పేదలకు ఓటు పోతే రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలా లేదా అనేది బీజేపీ డిసైడ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు విమర్శించారు. ఓటు ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర ఉన్నదన్నారు. బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

Also Read: CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?