Droupadi Murmu: నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. దేశవ్యాప్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 26వ వార్షిక జాతీయ సదస్సు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సివిల్ సర్వెంట్లను తీర్చిదిద్దాలని, ముఖ్యంగా అణగారిన వర్గాలపై, మహిళల పట్ల సున్నితత్వంతో వ్యవహరించేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక గొప్ప వేదిక అని కొనియాడారు.
తెలంగాణకు గర్వకారణం: బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, దేశ ప్రథమ పౌరురాలు ఈ సదస్సును ప్రారంభించడం తమకు గర్వకారణమని, ఇది కమిషన్ల పనితీరులో మరింత నిబద్ధతను నింపుతుందని అన్నారు. ఈ సదస్సులో యూపీఎస్సీతో పాటు 24 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు పాల్గొంటున్నారని వివరించారు. అనంతరం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, యూపీఎస్సీ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న తరుణంలో కమిషన్ల పనితీరును మరింత మెరుగుపరచడానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయాలన్న దార్శనికతను వివరించారు.
నియామక ప్రక్రియల్లో కీలక మార్పులు
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, ఈ మేధోమథనం ద్వారా దేశవ్యాప్తంగా నియామక ప్రక్రియల్లో కీలక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు మొదటి రోజున ఐటీ ఇంటర్వెన్షన్స్, నియామక ప్రక్రియల్లో ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ వినియోగం, ఇంటర్వ్యూ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై లోతైన చర్చలు జరిగాయి. ఇవాళ కూడా పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. ఈ సదస్సుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు.
Also Read: Delhi HC Judge Case: జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వివాదం.. సుప్రీంకోర్టు ప్యానెల్ సంచలన నివేదిక!

