Hardik Pandya: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు బాదాడు. ఇక, తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు రాబట్టాడు. వీరిద్దరి అదిరిపోయే ఇన్నింగ్స్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో, ప్రత్యర్థి దక్షిణాఫ్రికా టార్గెట్ 232 పరుగులుగా ఖరారైంది.
భారత్ పరుగుల జాతర
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల జాతర చేసుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు మ్యాచ్ ఆరంభం నుంచి చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు అందరూ చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ చక్కటి ఆరంభాన్ని అందించారు. శాంసన్ 37 పరుగులు, అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించి ఔటయ్యారు. శాంసన్ 2 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టగా, అభిషేక్ శర్మ 1 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు.
పాండ్యా పవర్ఫుల్ హిట్టింగ్
ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడంటే ఏ రేంజ్లో బాదిపడేశాడో అర్థం చేసుకోవచ్చు. టీ20ల్లో భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. పాండ్యా సిక్సర్ల వర్షం కురిపించాడు. 25 బంతుల్లో 63 పరుగులు కొట్టగా, అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలర్లు అందరినీ ఉతికిపారేశాడు. పాండ్యా కొట్టిన భారీ సిక్సర్ బౌండరీ లైన్ వద్ద ఉన్న కెమెరామన్ భుజానికి బలంగా తగిలింది. అంతకుముందు, ఒక బంతి అంపైర్ కాలుకు బలంగా తగిలింది. దీంతో, అంపైర్ విలవిల్లాడిపోయారు.
అదరగొట్టిన తిలక్ వర్మ
మరోవైపు యువ సంచలనం తిలక్ వర్మ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో మరోసారి ఆకట్టుకున్నాడు. 42 బంతుల్లో 73 పరుగులు చేసి చివరిలో ఔటయ్యాడు. తిలక్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొని, కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో శివమ్ దూబే 3 బంతుల్లో 10 పరుగులు బాదాడు. ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి నాటౌట్గా నిలిచాడు. జితేష్ శర్మ బ్యాటింగ్కు దిగినప్పటికీ, బంతులేమీ ఆడలేదు. ఇక, దక్షిణాఫ్రికా బౌలర్లలో కోర్బిన్ బాష్కు 2 వికెట్లు, బార్ట్మన్కు, లిండే చెరో వికెట్ తీశారు.
గెలిస్తే సిరీస్ మనదే
ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ టీ20 మ్యాచ్లో గెలిస్తే సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

