Drunk driving: పోలీసులు వరుసగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతున్నప్పటికీ మందుబాబుల్లో మార్పు రావడం లేదు. పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలతో రహదారులపైకి వస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇతరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 983 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పరిమితికి మించి మద్యం సేవించి 552 మంది పట్టుబడ్డారు.
మరో 431 మంది
వీరిలో అత్యధికంగా 438 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 45 మంది ఆటో డ్రైవర్లు, 69 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయా కోర్టుల్లో హాజరుపరచనున్నారు. ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో మరో 431 మంది చిక్కారు. వీరిలో 325 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 86 మంది కారు డ్రైవర్లు, నలుగురు భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు, గత వారం మందు కొట్టి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టులు శిక్షలు అమలు చేశాయి. గతంలో పట్టుబడిన వారిలో 264 మందికి కోర్టులు జరిమానాలు విధించగా, 35 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ చేయాలని ఆదేశాలు ఇచ్చాయి. 21 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Drunk and Drive: ప్రమాదాల నివారణే లక్ష్యం.. దొరికితే లైసెన్స్ రద్దుకు సిఫార్సు
గోవా లిక్కర్సీజ్.. 40 బాటిళ్లు పట్టివేత
విమానం ద్వారా గోవా నుంచి అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. గోవాలో తక్కువ ధరకే మద్యం దొరుకుతుండటంతో, తరచూ అక్కడికి వెళ్లే కొంతమంది వ్యక్తులు పర్మిట్కు మించి బాటిళ్లు కొని విమానాలు, బస్సుల్లో హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఈ బాటిళ్లను కొందరికి అమ్ముకుంటూ, మరికొన్నింటిని సొంతానికి వాడుకుంటున్నారు.
40 లిక్కర్బాటిళ్లను స్వాధీనం
నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంపై ఇటీవలి కాలంలో దృష్టి సారించిన ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ రోడ్డుతోపాటు పహాడీషరీఫ్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఐ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం శంషాబాద్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా విమానంలో తీసుకొచ్చి కార్లలో తరలిస్తున్న 40 లిక్కర్బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మీర్పేట ఎక్సైజ్స్టేషన్లో అప్పగించారు. అక్రమంగా మద్యం తరలించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.
Also Read:Drunk Driving: కేసులు నమోదు అయినా కనిపించని మార్పు..
