Ginning Mills Srike: మిల్లర్ల సమ్మెతో ఆగిపోయిన పత్తి కొనుగోళ్లు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలోనూ ఇదే పరిస్థితి
శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతుల ఆందోళన
అశ్వాపురం, స్వేచ్ఛ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన కొత్త నిబంధనలను నిరసిస్తూ, రాష్ట్రంలోని (Telangana) జిన్నింగ్ మిల్లుల యజమానులు (Ginning Mills Srike)వారం నుంచి సమ్మెకు దిగారు. ఫలితంగా, రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో, పత్తిరైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అశ్వాపురం మండలం నెల్లిపాకలోని శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి పత్తిని అమ్మేందుకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలోని శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లుకు వచ్చిన రైతులకు నిరాశ ఎదురైంది. వాహనాలు భారీ సంఖ్యలో మిల్లు వద్ద నిలిచిపోయాయి. పత్తి లోడుతో వచ్చిన లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. తెచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీఐ నూతన నిబంధనలను రద్దు చేయకపోతే తాము భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితి విషమించకముందే అధికారులు స్పందించి, కొనుగోళ్లను వెంటనే పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
యాజమాన్యాల సమ్మె నేపథ్యంలో మిల్లులు మూతపడ్డాయి. దీంతో, యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పత్తి మిల్లర్లు, వ్యాపారులు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపుతో కొనుగోళ్లను నిలిపివేశారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు, ముఖ్యంగా ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలు, కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ వంటివి తమకు నష్టం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
అసలేంటి వారి సమస్యలు?
సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2 కేటగిరీలుగా విభజించి, వాటి యంత్రాలు, సామర్థ్యం ఆధారంగా, ఎల్1 కేటగిరీ మిల్లులకే కొనుగోళ్లలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఈ నిబంధనతో ఇతర కేటగిరీలలోని మిల్లులు నష్టపోతున్నాయని వాదిస్తున్నారు. ఇక, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలనే రూల్ను కూడా వ్యతిరేకిస్తున్నారు. పత్తి అమ్మడానికి రైతులు ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, దీని కారణంగా ఆలస్యం అవుతుందని, కొన్ని మిల్లులకు మాత్రమే పని దొరుకుతుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి..?
తేమ శాతం పరిమితి 12 శాతం కంటే ఎక్కువ ఉంటే కొనుగోలుకు నిరాకరించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధన కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాదు మిల్లుల నిర్వహణ కూడా కష్టమవుతోందని వాపోతున్నారు. ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని పరిమితి సరికాదని అంటున్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల 12 క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుందని అంటున్నారు. సీసీఐ విధించిన ఈ కఠిన నిబంధనల కారణంగా తమ కార్యకలాపాలు నిర్వహణ ఆర్థికంగా సాధ్యం కావడం లేదని జిన్నింగ్ మిల్లుల యజమానులు అంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తున్నామని డిమాండ్ చేస్తున్నారు. కాగా, జిన్నింగ్ మిల్లుల సమ్మె కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ రేటుకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

