Viral Video: చైనాలో ఒక విద్యార్థిని చెప్పిన చిన్న కథ.. ఆమె తండ్రి జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. కూతురికి ఇంటి రుచి ఇష్టం. దాని కోసం ఒక తండ్రి చేసిన త్యాగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం, లీ బింగ్డి అనే యువతి జిలిన్ ప్రావిన్స్లోని జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ క్యాంటీన్లో ఉండే ఫుడ్ ఆమెకి నచ్చేది కాదు. ఇంటి వంట రుచి కోసం ఎప్పుడూ తహతహలాడుతూ ఉండేది. ఇలా ఆమె దాదాపు సంవత్సరం పాటు తన తండ్రితో పంచుకుంటూ వచ్చింది.
కూతురి మాటలకు మనసు కదిలిన తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టియాన్జిన్లోని బార్బెక్యూ హోటల్లో చేస్తున్న ఉద్యోగం వదిలి, దక్షిణ చైనాకు వెళ్లి ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వంటకాలు ఎలా చేయాలో ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. తర్వాత కూతురు ఉన్న యూనివర్సిటీ గేట్ వద్ద చిన్న ఫుడ్ స్టాల్ అద్దెకు తీసుకుని, తన కూతురు కోసం, ఆమెలాంటి విద్యార్థులకు. ఇంటి వంట రుచి అందించాలని సంకల్పించాడు. మిడ్ అక్టోబర్లో ప్రారంభమైన స్టాల్ మొదటి రోజు కేవలం 7 బౌల్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. లాభం తక్కువైనా, తన తండ్రి చేసిన శ్రమ చూసి లీ భావోద్వేగానికి గురైంది. తాను ట్యూటర్గా పనిచేసి 70 యువాన్ సంపాదించానని, తనకంటే తండ్రి తక్కువ ఆర్జించారని చెబుతూ ఆమె బాధపడింది. తండ్రి శ్రమను చూడలేక లీ తన యూనివర్సిటీ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన కథను పోస్ట్ చేసింది. ఆయన వంట చాలా బాగా చేస్తారనీ, కస్టమర్ల సూచనలు కూడా తీసుకుంటారని పేర్కొంది. ఈ పోస్ట్ చైనాలో బాగా వైరల్ అయ్యింది.
Also Read: Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం
తరువాతి రోజే ఫుడ్ స్టాల్ ముందు భారీ క్యూ కనిపించింది. విద్యార్థులు, లెక్చరర్లు, దగ్గర్లోని ప్రాంత ప్రజలు వరుసగా రావడం మొదలుపెట్టారు. కొందరు ప్రత్యేకంగా ఎక్కువ ఆర్డర్లు చేస్తూ ఆయనకు సపోర్ట్ చూపించారు. ప్రేమ, త్యాగం, అంకితభావంతో పని చేస్తున్న ఈ తండ్రిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
స్టాల్ వ్యాపారం పెరుగుతుండగా, లీ కూడా తన ఖాళీ సమయాన్ని అంతా తండ్రికి సహాయం చేసేందుకు కేటాయించింది. నెల క్రితం చలిలో వణుకుతూ స్టాల్ నడిపిన రోజులు గుర్తుచేసుకున్న ఆమె, ఇప్పుడు కస్టమర్ల రద్దీతో “తండ్రి హృదయం వెచ్చబడ్డది” అని చెప్పింది. పెద్ద లాభాలు కావాలన్న ఆశ ఏమీ లేకుండా, సాదాసీదాగా జీవిస్తూ, కూతురి దగ్గరే ఉండాలని ఆయన కోరుకున్నారని తెలిపింది.
