New Flyovers: గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేసి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ-1 ప్రాజెక్ట్ కింద కూకట్పల్లి వై-జంక్షన్లో మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. వై-జంక్షన్ నుంచి అమీర్పేట వైపు, అలాగే మియాపూర్ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, రాకపోకలు వేగంగా సాగేందుకు వీలుగా మూడు లేన్ల చొప్పున రెండు ఫ్లై ఓవర్లను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ స్థల సేకరణ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: Flyovers Safety: పీజేఆర్ ఫ్లైఓవర్ పై ప్రమాద నివారణ చర్యల పరిశీలన: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
44 ఆస్తుల నుంచి దాదాపు 11,185 చదరపు అడుగులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి గ్రామంలో మొత్తం 44 ఆస్తుల నుంచి దాదాపు 11,185 చదరపు అడుగుల (గజాల) స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఈ సేకరణలో గరిష్టంగా ఒక ఆస్తి నుంచి 1159.47 గజాలు, కనిష్టంగా 35.4 గజాల స్థలాన్ని సేకరించనున్నారు. స్థల సేకరణకు సంబంధించి మొదటగా యజమానులకు ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ఆఫర్ చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఒకవేళ యజమానులు టీడీఆర్కు అంగీకరించకపోతే, వారికి ఆ ప్రాంత భూమి మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకుని, ఆకర్షణీయమైన నష్టపరిహారాన్ని చెల్లించాలని బల్దియా భావిస్తోంది.
ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
ఈ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే అమీర్పేట, సంజీవరెడ్డినగర్, ఎర్రగడ్డ, భరత్నగర్, మూసాపేట వంటి ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది. అలాగే, మియాపూర్ వైపు నిర్మించనున్న మూడు లేన్ల ఫ్లై ఓవర్ కూడా పూర్తైతే, కేపీహెచ్బీ మీదుగా మియాపూర్ వరకు వాహనాల రాకపోకలు వేగవంతం కానున్నాయి. స్థల సేకరణ ప్రక్రియ ఆరు నెలల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను చేపట్టి వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు వేస్తోంది. ఈ ఫ్లై ఓవర్లతో సిటీ సెంట్రల్ నుంచి బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి వరకు ప్రజారవాణ వ్యవస్థ సేవలు కూడా మెరుగుపడనున్నాయి.
Also Read: RBI Recruitment 2025: రూ.78 వేల జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
