CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆ నియోజకవర్గానికి చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు సీఎంతో భేటి అయ్యారు. ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తమ సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు.
‘బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టుపెట్టారు’
క్రైస్తవ సంఘాలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసింది. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్రం.. మౌనం ఎందుకు?
కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘ఈ – కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మాత్రం విచారణకు పిలవడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Smartphones Under rs 30000: రూ.30 వేలలో టాప్ కెమెరా ఫోన్లు.. ఐఫోన్ రేంజ్ క్వాలిటీ.. ఫొటోలు, ఇన్స్టా రీల్స్కు బెస్ట్ ఛాయిస్!
దళితులకు కాంగ్రెస్ పెద్దపీట
బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్ ను ప్రయోగశాలగా చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడు. మా మంత్రి వర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం ఇచ్చాం. అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం. జూబ్లీహిల్స్ లో మోదీ, కేసీఆర్ ఒక వైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరో వైపు నిలబడ్డారు’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
