Harmanpreet Kaur: ఉమెన్స్ వరల్డ్ కప్-2025ను భారత జట్టు గెలవడంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో, ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదివారం రాత్రి (నవంబర్ 2) మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో చారిత్రక విజయం సాధించి 24 గంటలు కూడా గడవకముందే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు బంపరాఫర్ దక్కింది. పంజాబ్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఒమాక్స్ లిమిటెడ్’తో భారీ ఎండార్స్మెంట్ డీల్ కుదుర్చుకుంది.
హర్మన్ప్రీత్ను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒమాక్స్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభను ప్రోత్సహించడం, క్రీడాకారుల ఎదుగుదలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా హర్మన్ప్రీత్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఒమాక్స్ వివరించింది. వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో హర్మాన్ప్రీత్ కౌర్ క్రేజ్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఆదివారం రాత్రి నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో, భారత అమ్మాయిలు తొలిసారి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకుంది.
Read Also- Jogulamba Gadwal: సిసిఐ కొనుగోలు ఊపందుకునేనా..! పత్తి రైతుకు ప్రకృతి సహకరించేనా..!
హర్మన్ప్రీత్ కౌర్ స్పందన ఇదే
ఒమాక్స్ కంపెనీ తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడంపై కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్ స్పందించింది. ఒమాక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంపెనీలో చేరడం తనకు ఎంతో గర్వకారణమని ఆమె చెప్పారు. యువతకు సాధికారత కల్పించడం, కలలను విజయాలుగా మార్చే సదుపాయాలను నిర్మించడంలో ఎంతో విశ్వాసం ఉన్న కంపెనీతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పింది. వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలను సృష్టించాలనే కంపెనీ లక్ష్యం యువతకు ఎన్నో కలలను చేరువ చేస్తుందని ఆమె జోడించారు. హర్మాన్ప్రీత్ కౌర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడంపై ఒమాక్స్ ఎండీ మోహిత్ గోయెల్ స్పందించారు. ఈ ఒప్పందం క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్లో మహిళ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
హర్మన్ప్రీత్ కౌర్ ఎమోషనల్
ఆదివారం రాత్రి జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్-2025 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచిన తర్వాత కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురైంది. విజయం అనంతరం మాట్లాడుతూ, వరల్డ్ కప్ గెలుపు గురించి గత కొన్నేళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నామని, బాగా క్రికెట్ ఆడుతున్నాం, ఒక పెద్ద టోర్నమెంట్ గెలవాలని భావించామని, అది సాధించినట్టు పేర్కొంది. ముఖ్యంగా, ఫ్యాన్స్ తమ అభిమాన జట్టు గెలవాలని కోరుకుంటారని, ఈ క్షణం కోసం తాము ఎంతగానో ఎదురుచూశామని చెప్పింది. ఎట్టకేలకు ఇవాళ ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశం తమకు లభించిందని ఆమె పేర్కొంది. ‘‘నా భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ టీమ్ విషయంలో నేను గర్వపడుతున్నాను’’ అని ఆమె చెప్పింది. ఆద్యంతం భావోగ్వేగంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

