Montha Cyclone: మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, పూర్తి వివరాలతో వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం మొంథా తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, నష్టం అంచనాపై సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 24 జిల్లాలు ఈ మొంథా వల్ల ప్రభావితమయ్యాయని సీఎస్ తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతో పాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. నష్టపరిహారం అందించేందుకు వీలుగా నష్టం వివరాలను సోమవారం వరకు పంపించాలని కోరారు.
శాశ్వత పరిష్కారాలు
ఇటీవల కాలంలో ఎలాంటి సూచనలు లేకుండానే 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందని సీఎస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు ధ్వంసం అయితే, వాటి పునరుద్ధరణకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎస్ తెలిపారు. తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం లేకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను కోరారు.
