IND vs AUS 1st Innings: ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 50 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్, శ్రేయస్ అయ్యార్, అక్షర్ పటేల్ రాణించారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లోనూ డకౌట్ గా వెనుదిరిగి ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. చివరలో హర్షిత్ రానా కీలక ఇన్నింగ్స్ ఆడి.. భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ ను ఆసీస్ కైవసం చేసుకోగా.. భారత్ కు ఈ మ్యాచ్ లో గెలుపు కీలకంగా మారింది.
కాపాడిన రోహిత్ – అయ్యర్
అడిలైడ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆసీస్.. టీమిండియాను బ్యాటింగ్ ను ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్ కు వచ్చిన రోహిత్ – గిల్ జోడి.. తొలి వికెట్ కు 17 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా సారథి గిల్ 9 (9) పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ సైతం.. నాలుగు బాల్స్ ఎదుర్కొని ఖాతా తెరవకుండానే డకౌట్ (0)గా పెవిలియన్ చేరాడు. దీంతో ఓపెనర్ రోహిత్ (73).. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (61) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు మూడో వికెట్ 118 (136) భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను మెరుగైన స్థితిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత రోహిత్ 135-3 స్కోర్ వద్ద వికెట్ కోల్పోవడం.. మరో 25 పరుగులకే (160-4) శ్రేయాస్ సైతం పెవిలియన్ చేరడంతో భారత్ తిరిగి కష్టాల్లో పడింది.
నిరాశపరిచిన రాహుల్, నితీశ్
ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 44 (41) ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (11), ఆల్ రౌండర్స్ నితీశ్ కుమార్ రెడ్డి (8), వాషింగ్ టన్ సుందర్ (12) వెంట వెంటనే ఔటైన.. ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను అక్షర్ భుజాన వేసుకున్నాడు. నెమ్మదిగా స్కోర్ బోర్డును ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. 223-7 స్కోర్ వద్ద అక్షర్ వికెట్ పడటంతో.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన భారత బౌలర్స్ హర్షిత్ రానా (24), అర్షదీప్ సింగ్ (13) 9వ వికెట్ కు 37(29) భాగస్వామ్యం నెలకొల్పి భారత్ కు గౌరవప్రదమమైన స్కోరును అందించారు. మహమ్మద్ సిరాజ్ (0) నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు.
Also Read: Hyderabad Crime: గో రక్షక్ కార్యకర్తపై కాల్పులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పూసగుచ్చినట్లు చెప్పిన సీపీ
జంపా స్పిన్ మాయజాలం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 10 ఓవర్లకు 60 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లను పడకొట్టాడు. బౌలర్లలో గ్జేవియర్ బ్రెట్ లెట్ 3 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హెజిల్ వుడ్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లకు 2.90 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు. అయితే అతడికి వికెట్లు రాకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలవాలంటే 50 ఓవర్లలో 265 పరుగులు చేయాలి.
