Ola Engineer Death: బెంగుళూరులో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీలో హోమోలోగేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్న కే.అరవింద్ అనుమానాస్పదంగా మృతి (Ola Engineer Death) చెందాడు. అయితే, ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చనిపోవడానికి ముందు ఏకంగా 28 పేజీలతో కూడిన లేఖ రాశాడు. అందులో తన మరణానికి కారణమైన వ్యక్తులను పేర్కొన్నాడు. దీంతో, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్, సీనియర్ అధికారి సుబ్రతా కుమార్ దాస్, కంపెనీపై కేసు నమోదయింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద అక్టోబర్ 6న ఎఫ్ఐఆర్ (FIR) నమోదవ్వగా, ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
రూ.17.46 లక్షలు అకౌంట్లో పడడంతో అనుమానం
మృతుడు అరవింద్ సెప్టెంబర్ 28న విషం తాగి చనిపోయాడు. పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే, అరవింద్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతడి అకౌంట్లో రూ.17.46 లక్షలు పడ్డాయి. దీంతో, కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. చనిపోయాక సడెన్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడంపై ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ హెచ్ఆర్, అధికారులను ప్రశ్నించగా వారు స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులకు మరింత అనుమానం పెరిగింది.
Read Also- Mysterious Object: విమానం గాల్లో ఉండగా సడెన్గా ఢీకొన్న గుర్తుతెలియని వస్తువు.. క్షణాల్లోనే..
పోలీసులు రంగంలోకి దిగి అరవింద్ గదిలో సోదాలు నిర్వహించగా, 28 పేజీల మరణ వాంగ్మూలం (Death Note) దొరికింది. అందులో ఆత్మహత్యకు కారణాలను అరవింద్ వివరించాడు. సీనియర్ అధికారి సుబ్రతా కుమార్ దాస్, సీఈవో భవిష్ అగర్వాల్ పేర్లను పేర్కొన్నాడు. మానసిక వేధింపులకు గురిచేశారని, అధిక పని ఒత్తిడి, జీతంతో పాటు బకాయిలు చెల్లించకపోవడం తన చావుకు కారణాలు అని పేర్కొన్నాడు. ఈ నోట్ ఆధారంగా, అరవింద్ కుటుంబం ఫిర్యాదు చేయగా, పోలీసులు సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 108 సెక్షన్ 3(5) సెక్షన్లను పేర్కొన్నారు. సుబ్రతా కుమార్ దాస్, భవిష్ అగర్వాల్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
కంపెనీ స్పందన ఏంటంటే..
అరవింద్ మరణంపై ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అధికార ప్రతినిధి స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మా సహోద్యోగి అరవింద్ అకాల మరణం పట్ల మేము తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ కష్టకాలంలో అతడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అరవింద్ గత మూడున్నర సంవత్సరాలుగా ఓలా ఎలక్ట్రిక్లో పనిచేస్తున్నారు. బెంగళూరులోని మా హెడ్ ఆఫీస్లో విధులు నిర్వహించారు. ఆయన పని చేస్తున్న కాలంలో, ఉద్యోగంలో, లేదా ఏ విధమైన వేధింపులపై, ఏనాడూ ఫిర్యాదు లేదా అభ్యంతరం లేవనెత్తలేదు. అలాగే, కంపెనీ టాప్ మేనేజ్మెంట్తో, ప్రమోటర్తో ఆయన నేరుగా ఎప్పుడూ మాట్లాడిందే లేదు’’ అని చెప్పారు.
Read Also- MLC Kavitha: జనం బాట యాత్రకు స్వామి వారి ఆశీస్సులు కోరాను: ఎమ్మెల్సీ కవిత
కంపెనీ ఉద్యోగి చనిపోవడంతో, కుటుంబానికి తక్షణ సాయం కింద ఆయన బ్యాంక్ ఖాతాకు ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ను వెంటనే బదిలీ చేశామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కర్ణాటక హైకోర్టులో సవాలు చేశామని కంపెనీ వివరించింది. దర్యాప్తు విషయంలో అధికారులకు సహకరిస్తున్నామని కంపెనీ తెలిపింది.
