University Staff Shortage: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీపై జాప్యం జరుగుతున్నది. నియామక ప్రక్రియ కోసం ప్రభుత్వ గైడ్ లైన్స్ విడుదల చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వర్సిటీలన్నీ రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయి. స్టేట్ యూనివర్సిటీ(State University)ల్లో రిక్రూట్మెంట్ కోసం బోర్డును ఏర్పాటు చేస్తూ గత బీఆర్ఎస్(BRS) సర్కార్ నిర్ణయం తీసుకున్నది. దీనిపై అప్పటి గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతికి పంపించారు. దీంతో అది అక్కడే పెండింగ్లో పడింది. తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మళ్లీ పాత విధానంలో నియామక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(Professor Ghanta Chakrapani) ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ కొత్త గైడ్ లైన్స్ను కూడా రూపొందించింది. అయితే, రిపోర్ట్ ఏప్రిల్లోనే అందినా ఇప్పటి వరకు వర్సిటీల ఈసీ సమావేశాలు కూడా పూర్తి కాలేదు.
రోస్టర్ పాయింట్ల తయారీపై జాప్యం
గతేడాది డిసెంబర్ 31 నాటికి మంజూరైన పోస్టులు 2,878 ఉండగా వీటిలో 753 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల మంజూరు కోసం వర్సిటీ ఈసీల్లో ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం నాలుగైదు యూనివర్సిటీలు మాత్రమే ఈసీలు నిర్వహించాయి. ఇంకా రోస్టర్ పాయింట్ల తయారీపై జాప్యం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీసీలను నియమిస్తామని, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. రెండు, మూడు వర్సిటీలు మినహా మిగిలిన వాటికి కొత్తగా రెగ్యులర్ వీసీలు వచ్చినా, రిక్రూట్మెంట్ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతున్నది. ప్రొఫెసర్లు లేకపోవడంతో వర్సిటీల స్టాండర్డ్స్ క్రమంగా తగ్గుతున్నది. సమస్య తీవ్రంగా వేధిస్తున్నా పట్టించుకోవడం లేదు.
Also Read: Delhi Fire Accident: ఎంపీల అపార్ట్మెంట్ల్లో మంటలు.. ఢిల్లీలో ఘోరఅగ్నిప్రమాదం
ప్రభుత్వం దృష్టి పెట్టాలి: విద్యార్థి సంఘాలు
రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. అయితే, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కమిటీ ఇచ్చిన రిపోర్టుపై వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం వారిని డిస్టర్బ్ చేయకుండా, మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకోవాలని సూచనలు చేసింది. వర్సిటీల వారీగా నియామకాలు చేసుకోవాలని అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ముందడుగు వేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలో ఇంత ఆలస్యం జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. మరోసారి వర్సిటీల రిక్రూట్మెంట్పై సర్కార్ దృష్టి సారించి జటిలంగా మారిన సమస్యను పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల సంఘాలు కోరుతున్నాయి.
