Asia Cup 2025: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఆదివారం (సెప్టెంబర్ 21) భారత్-పాకిస్థాన్ జట్ల అత్యంత కీలకమైన సూపర్-4 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీ ఖరారయ్యారు. ఈ మేరకు ఐసీసీ అధికారులు శనివారం ధృవీకరించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) సమాచారం ఇచ్చినట్టుగా ‘క్రిక్బజ్’ కథనం పేర్కొంది.
ఐసీసీ ఇప్పటికే పైక్రాఫ్ట్పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసింది. కాబట్టి, ఆయనపై ఎలాంటి నిందలు వేయవద్దని పీసీబీకి సూచించింది. విచారణలో నిర్దోషిగా తేలిన తర్వాత కూడా ఆండీ పైక్రాఫ్ట్ నైతికత, విశ్వసనీయతను దెబ్బతీసేలా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదని ఐసీసీ స్పష్టం చేసినట్టు తెలిసింది. ‘‘న్యాయమైన విచారణ అనంతరం ఆయనను నిర్దోషిగా ప్రకటించాక, నైతికతను ప్రశ్నించకూడదు’’ అని సూచించినట్టుగా దుబాయ్లో ఐసీసీ వ్యవహారాలపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి.
కాగా, ఆండీ పైక్రాఫ్ట్ కేవలం ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రమే కాదు, సెప్టెంబర్ 25న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మరో సూపర్ ఫోర్ మ్యాచ్కు కూడా రిఫరీగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 23న శ్రీలంకతో జరిగే మ్యాచ్కు వెస్ట్ ఇండీస్కు చెందిన రిచీ రిచర్డ్సన్ రిఫరీగా ఉండనున్నారు. ఈ మేరకు షెడ్యూలింగ్ ఖరారమైంది. కాగా, యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ కోసం ఐసీసీ ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దాని ప్రకారం, దుబాయ్లో జరిగే అన్ని మ్యాచ్లను ఆండీ పైక్రాఫ్ట్ పర్యవేక్షిస్తారు. అబుదాబిలో జరిగే మ్యాచ్లను రిచర్డ్సన్ పర్యవేక్షిస్తారు. ఈ ప్రణాళిక ప్రకారమే, మ్యాచ్లు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 24న దుబాయ్లో జరిగే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా కొనసాగనున్నాయి. అయితే, సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్కు ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. ఇదే వేదికపై శనివారం (సెప్టెంబర్ 21) శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్కూ ఆయనే రిఫరీగా ఉన్నారు. సాధారణంగా నాకౌట్ మ్యాచ్లకు అధికారులను నియమించే విషయంలో, టోర్నమెంట్లో వారి పనితీరు ఆధారంగా ఐసీసీ నియామకాలు చేస్తుంటుంది. నియామకాల్లో సభ్య దేశాలకు ఎలాంటి ప్రమేయం ఉండదు.
మ్యాచ్ అధికారుల నియామకాల్లో, సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు ఏ హక్కూ ఉండదు. సంబంధిత నిర్ణయాలు మొత్తం ఐసీసీ అధీనంలో ఉంటాయని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా స్పష్టం చేశారు. మ్యాచ్ అధికారులు ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు లోనవకుండా, పూర్తిగా స్వేచ్ఛగా ఉండేలా చూసే బాధ్యత ఐసీసీదేనని వివరించారు.
కాగా, గత మ్యాచ్లో ‘నో హ్యాండ్షేక్’ వివాదంలో మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్ కీలక పాత్ర పోషించారని పీసీబీ ఆరోపించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వద్ద పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
Read Also- Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక