Thummala Nageswara Rao: రాష్ట్రానికి ఈ నెలలో మొత్తం 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియా కేటాయింపును కేంద్రం ఆమోదించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)తెలిపారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం యూరియా సరఫరాల కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రబీ సాగు కూడా ఆరంభమవుతున్న ఈ సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో లోపం కలగకుండా చూసే చర్యలను ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే ప్రాధాన్యతగా తీసుకుంటోందన్నారు.
Also Read: Press Meet Cancel: రేపే భారత్తో మ్యాచ్.. ప్రెస్మీట్ రద్దు చేసుకున్న పాకిస్థాన్.. కారణం ఇదే!
13,000 మెట్రిక్ టన్నులు సరఫరా
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర వినతులు, ఢిల్లీ వెళ్లి ప్రత్యక్షంగా మంత్రులను పలుమార్లు కలసి చేసిన అభ్యర్థనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జైగడ్, కృష్ణపట్నం వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా యూరియా రాష్ట్రానికి చేరుతుందని, ఇందులో కాకినాడ నుండి 15,900 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం 37,650 మెట్రిక్ టన్నులు, గంగవరం 27వేలు, మంగళూరు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు, జైగడ్ నుంచి 16,200 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం నుంచి 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నాయన్నారు.
మరో 50,000 మెట్రిక్ టన్నులు
ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రానికి 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందన్నారు. కేంద్రం అదనంగా కేటాయించిన ఇంపోర్టెడ్ యూరియాలో ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు లోడింగ్లో ఉండగా, రాబోయే వారంలో మరో 50,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ పూర్తి కానున్నాయి. అలాగే 30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే ట్రాన్సిట్లో ఉన్నాయని, ఈ సరఫరా వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రధాన వనరుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం కీలకమైనదన్నారు.
రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి
గత 90 రోజులుగా ప్లాంట్ షట్డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని,ఈ పరిస్థితి రాష్ట్ర రైతులకు అంతరాయం కలిగించకుండా ఉండేందుకు రామగుండం యూనిట్ను త్వరితగతిన పునరుద్ధరించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎరువుల కొరత లేకుండా, సాగుకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటోందన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తూ ఉంటుందని మంత్రి తెలిపారు.
Also Read: Uttar Pradesh: ఎస్పీ తల్లికి అనారోగ్యం.. డాక్టర్ను ఎత్తుకెళ్లిన పోలీసులు.. యూపీలో రచ్చ రచ్చ!