Hyderabad: హైదరాబాద్ తోపాటు వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రెండో రోజు కూడా ముమ్మర తనిఖీలు జరిపారు. అదే సమయంలో ఈడీ అధికారులు కూడా వేర్వేరు చోట్ల సోదాలు చేశారు. బంగారం వ్యాపారంలో ఉన్న క్యాప్స్ గోల్డ్ సంస్థ భారీగా పన్నులు ఎగ్గొట్టినట్టు అందిన సమాచారం మేరకు వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు బుధవారం పదిహేను చోట్ల దాడులు చేసిన విషయం తెలిసిందే. క్యాప్స్ గోల్డ్ కంపెనీతోపాటు వాసవి గ్రూప్, కలాసా జువెలరీ గడిచిన అయిదేళ్లలో చెల్లించిన పన్ను వివరాలపై అధికారులు ఆరా తీశారు.
వాసవి గ్రూప్ ఛైర్మన్ ఇంట్లో..
క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు చేశారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యలు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కూడా తనిఖీలు జరిపారు. ఇక, వాసవి గ్రూప్ ఛైర్మన్ విజయ్ కుమార్ ఇంటితోపాటు సంస్థ ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. రాత్రంతా తనిఖీలు కొనసాగటం గమనార్హం.
ఏపీ లిక్కర్ స్కాంలో…
ఇక, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్ లో గురువారం పలు చోట్ల తనిఖీలు జరిపారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని వెల్లింగ్ టన్ ఎన్ క్లేవ్ లో ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేశ్, ఆయన కుమారుడు విక్రాంత్ ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ లో బూరుగు శ్రీకాంత్ డైరెక్టర్ గా ఉన్నాడు. లిక్కర్ స్కాంలోని కీలక సూత్రధారులు కొట్టేసిన కోట్లాది రూపాయలను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించి స్వాహా చేసినట్టుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు జరిపిన విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగారం వ్యాపారులకు కోట్ల రూపాయలను నగదుగా ఇచ్చి భారీ మొత్తంలో బంగారం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగానే ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. తనిఖీల్లో బంగారం లావాదేవీల్లో బూరుగు విక్రాంత్ తదితరులు మనీ లాండరింగ్ కు పాల్పడటంతోపాటు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.
Also Read: Techie Shot Dead: అమెరికాలో ఘోరం.. తెలంగాణ యువకుడ్ని.. కాల్చి చంపిన పోలీసులు
శశికళ బినామీ ఆఫీసుల్లో…
ఇక, బ్యాంకును రూ.200 కోట్ల మేర మోసం చేసిన కేసులో చెన్నై యూనిట్ ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ లోని వేర్వేరు చోట్ల తనిఖీలు చేశారు. ఈ కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహిత స్నేహితురాలిగా ఉన్న శశికళ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శశికళకు బినామీగా భావిస్తున్న జీఆర్కే.రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు ఈడీ అధికారుల చేతికి చిక్కినట్టు సమాచారం.