Techie Shot Dead: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో తెలంగాణ యువకుడ్ని పోలీసులు కాల్చి చంపారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా పామురుకు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ (30)గా పోలీసులు గుర్తించారు. తోటి రూమ్ మేట్ పై నిజాముద్దీన్ కత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సాంటా క్లారా పోలీసులు తాజాగా వెల్లడించారు. దీంతో తెలంగాణ విద్యార్థి మృతి ఘటన.. యావత్ ప్రపంచానికి తెలిసింది.
పోలీసుల వెర్షన్ ఏంటంటే?
సాంటా క్లారా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం.. 911 (ఎమర్జెన్సీ నెంబర్)కు కత్తిపోటు దాడి గురించి కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటీనా కాల్ వచ్చిన ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో నిజాముద్దీన్ (Mohammed Nizamuddin) చేతిలో కత్తి ఉందని.. అప్పటికే తోటి రూమ్ మేట్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అతడ్ని నిలువరించేందుకు యత్నించినప్పటికీ నిజాముద్దీన్ వెనక్కి తగ్గలేదని ఆరోపించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని సాంటా క్లారా పోలీసులు వివరించారు. కాల్పుల అనంతరం వెంటనే నిజాముద్దీన్ ను ఆస్పత్రికి తరలించామని.. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. గాయపడ్డ తోటి రూమ్ మేట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు.
ఫ్యామిలీ రియాక్షన్..
అయితే నిమాముద్దీన్ కుటుంబ సభ్యుల వాదన.. పోలీసుల ప్రకటనకు పూర్తి భిన్నంగా ఉంది. సహాయం కోసం నిజాముద్దీనే పోలీసులకు కాల్ చేశాడని వారు చెబుతున్నారు. కానీ చివరికి తమ బిడ్డనే పోలీసులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవచూపి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేకాదు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని.. తమ బిడ్డ మరణానికి దారితీసిన పరిస్థితులపై నిజాలు వెలుగులోకి తేవాలని కోరుతున్నారు. నిజాముద్దీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం సాంటా క్లారా ఆసుపత్రిలో విధివిధానాల కోసం ఉంచబడి ఉంది.
వర్ణవివక్షపై నిజాముద్దీన్ ఆరోపణలు
ఇదిలా ఉంటే నిజాముద్దీన్.. ఫ్లోరిడాలోని ఒక కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం సాంటా క్లారాలోని ఒక టెక్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమ బిడ్డ చాలా మంచి వ్యక్తి అని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా వర్ణ వివక్ష, వేతన మోసం, అన్యాయంగా ఉద్యోగం కోల్పోవడం వంటి అంశాలపై ఆయన గతంలో బహిరంగంగా ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో లింక్ డిన్ లో పెట్టిన పోస్ట్ గురించి తెలియజేశారు. ‘నేను వర్ణ ద్వేషం, వర్ణ వివక్ష, వర్ణ వేధింపులు, హింస, వేతన మోసం, అన్యాయంగా ఉద్యోగ విరమణ, న్యాయానికి ఆటంకం వంటి వాటికి బలయ్యాను. చాలు, వైట్ సుప్రీమసీ / రేసిస్టు అమెరికన్ మెంటాలిటీ ఇక ముగియాలి’ అంటూ నిజాముద్దీన్ గతంలో రాసుకొచ్చారు.
Also Read: Chimpanzee: జంతువుల్లో పచ్చితాగుబోతు చింపాజీలే.. రోజూ మద్యం ఉండాల్సిందే.. భలే విచిత్రంగా ఉందే!
కేంద్రానికి లేఖ..
అయితే తన హత్యకు గతంలోనే కుట్ర జరిగినట్లు కూడా నిజాముద్దీన్ లింక్ డ్ ఇన్ పోస్టులో ఆరోపించారు. తన ఆహారంలో విషం కలపడం, ఇంటి నుండి వెళ్ళగొట్టడం, ఒక డిటెక్టివ్ తనపై నిరంతర నిఘా పెట్టడం వంటి ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉంటే మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్.. నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ను కలసి సంతాపం తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. ఆయన అమెరికాలోని భారత రాయబారి కార్యాలయం (వాషింగ్టన్ DC) సాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ ఈ ఘటనపై పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని.. అలాగే మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు.