Shocking Incident: పాతబస్తీ యాకుత్ పురాలో పూడిక తీసేందుకు హైడ్రా(Hydraa) ఓపెన్ చేసి ఉంచిన మ్యాన్ హోల్ లో ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. ఆ చిన్నారితో పాటు ఉన్న తల్లి సమయస్పూర్తిగా వ్యవహారించి ఆ చిన్నారిని కాపాడుకున్న ఘటన పాతబస్తీ యాకుత్ పురా(Old City Yakutpura) లో గురువారం ఉదయం జరిగింది. రెయిన్ బజార్ డివిజన్ పరిధిలోని మౌలా కా చిల్లా ప్రాంతంలో నివసించే ఐదేళ్ల చిన్నారి ఉదయం ఎనిమిది గంటల సమయంలో తల్లితో కలిసి స్కూల్ కు వెళ్తూ, ప్రమాదవశాత్తు తెరిచి ఉంచిన మ్యాన్ హోల్(Manhole) లో పడి పోయింది. అప్పటికపుడు సమయస్పూర్తితో వ్యవహారించిన తల్లి వెంటనే ఆ చిన్నారిని క్షణాల్లో బయటకు తీసింది. చిన్నారికెలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాన్ హోల్ లో నీటి ప్రవాహాం పెద్దగా లేకపోవటం వల్లే చిన్నారి సురక్షితంగా బయట పడినట్లు సమాచారం.
పూడికతీత కోసం తెరిచి వదిలేశారు
మ్యాన్ హోల్ లో చిన్నారి పడిపోయిందన్న సమాచారం తెలియగానే జీహెచ్ఎంసీ సర్కిల్-7 సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ హుటాహుటీన అక్కడకు చేరుకుని ఘటనకు కారణాలను తెల్సుకున్నారు. పూడికతీసేందుకు హైడ్రా బుధవారం ఆ మ్యాన్ హొల్ ను తెరిచి, మళ్లీ మూసేయకుండా అలాగే ఉంచటం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిర్థారించారు. తదుపరిగా ఈ విషయాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ కమిషనర్ కోరినట్లు తెలిసింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హైడ్రా అధికారులకు సూచించారు.
Also Read: Anupama Parameswaran: వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఎందుకంటే?
ఘటనపై నేడు హైడ్రా సమావేశం
పాతబస్తీలోని యాకుత్పురా డివిజన్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. కాని ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు హైడ్రా(Hydraa) వెల్లడించింది. ఇందుకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. బాధ్యులు ఎవరనేదానిపై ప్రాథమికంగా వెంటనే దర్యాప్తు చేసింది. ఈమేరకు బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయిన వరకు అక్కడి సీసీటీవీ ఫుటేజీను తెప్పించుకుని పరిశీలిస్తోంది. అలాగే స్థానికంగా పని చేస్తున్న హైడ్రా, జలమండలి, జీహెచ్ఎంసీ విభాగాలతో శుక్రవారం సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు అక్కడ మ్యాన్హోల్ను తెరచి మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టింది. కొన్నేళ్లుగా మట్టి పేరుకుపోవడంతో గట్టిగా మారి తొలగించడానికి వీలు లేకుండా పోయింది. జలమండలి జెట్టింగ్ మెషిన్లతో తొలగించాలని నిర్ణయించారు. ఆ వెంటనే జలమండలి జెట్టింగ్ మెషిన్ వచ్చి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది.
ఇంకా పని పూర్తి కాలేదని..
వేరే మ్యాన్ హోల్ శుభ్రం చేసే పనిని స్థానిక కార్పొరేటర్ సూచించడంతో హైడ్రా ఎంఈటీ సిబ్బంది అక్కడకు వెళ్లారు. మ్యాన్హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్టు ప్రాధమిక సమాచారం. బుధవారం సాయంత్రం రెండో షిఫ్టు హైడా ఎంఈటీ సిబ్బంది గమనించి మూత వేయడానికి ప్రయత్నించగా, ఇంకా పని పూర్తి కాలేదని, తెరిచే ఉంచాలని స్థానికంగా ఉన్న వాళ్లు అడ్డుకోవడంతో మూత వేయకుండానే వెళ్లిపోయారు. గురువారం ఉదయం స్కూల్ కు వెళ్లే చిన్నారి అందులో పడిపోవడం, అది గమనించిన తల్లి అప్రమత్తమై కాపాడటంతో ప్రాణ నష్టం తప్పినట్లు హైడ్రా వెల్లడించింది. మూతలు తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్, మూతల్లేని మ్యాన్ హోల్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9000113667 కు సమాచారమివ్వాలని హైడ్రా సూచించింది.
Also Read: Vivek Venkataswamy: రాష్ట్రంలో రెడ్ క్యాట్ కంపెనీలకు నోటీసులు ఇస్తాం: మంత్రి వివేక్!