Revanth Reddy: సిద్ధాంతం బలమైనది
కమ్యూనిజమ్ అంటే లైబ్రరీలో పుస్తకాలు కాదు
ప్రజల పక్షాన పోరాడే చైతన్యం
నమ్మిన సిద్ధాంతంతోనే సురవరం ప్రయాణం
చివరి శ్వాస వరకు పనిచేశారు
నిజాం నిరంకుశ పాలనపై పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కమ్యూనిస్టులు తలచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయని తాను బలంగా నమ్ముతున్నానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. శనివారం ఆయన రవీంద్ర భారతిలో శనివారం జరిగిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు సిద్ధాంత పరిధి పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కమ్యూనిజమ్ అంటే కేవలం లైబ్రరీలో చదివే పుస్తకం కాదని, ప్రజల పక్షాన పోరాడే చైతన్యం అని కొనియాడారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన చేసే వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో సురవరం లాంటి వారి అవసరం ఇప్పుడు ఉన్నదన్నారు. దేశంలో అధికారంలో ఉన్న వాళ్లు, ఎన్నికల కమిషన్ను కూడా భాగస్వామ్యం చేసుకుని అధికారం పదిల పరుచుకోవాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also- HYD News: ప్రియుడితో కలిసి భర్త హత్య.. హైదరాబాద్లో షాకింగ్ ఘటన
నాలుగు నెలల్లో కోటి ఓట్లు పుట్టగలవా?, ప్రజాస్వామ్యవాదులంతా ఓ సారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగించి, తద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని రేవంత్ ప్రస్తావించారు. అంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విపరీతమైన పోకడలను కట్టడి చేసేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. నిత్యం ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే అని వివరించారు.
ఇక విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు, ఎంత ఎత్తుకు ఎదిగినా సురవరం సుధాకర్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఏ జెండాను మోయడం గొప్పగా భావించారో, చివరి శ్వాస వరకు ఆ జెండా నీడలోనే ఉండటం చాలా అరుదు అంటూ కొనియాడారు. అలాంటి వారిలో సురవరం సుధాకర్ రెడ్డి ఒకరు అంటూ మెచ్చుకున్నారు. సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు యోధుడు సురవరం అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గోల్కొండ పత్రికతో గతంలో సురవరం ప్రతాపరెడ్డి పోరాటం చేశారన్నారు.
Read Also- Jobs In Railways: రైల్వేలో 2,865 ఉద్యోగాలు… శనివారం నుంచి మొదలైన దరఖాస్తులు
మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాకు వన్నె తీసుకురాగా, రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అందుకే ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చే విధంగా మంత్రివర్గంతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. సుధాకర్ రెడ్డి సూచన మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నామని, ప్రజల కోసం పోరాటం చేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. అలాంటివారి చిరునామా తెలంగాణలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందుకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటామన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామన్నారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.