BCCI: గత కొన్ని నెలల వ్యవధిలో భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ఇక, చెతేశ్వర్ పుజారా కూడా ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికాడు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఇటీవలే అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని డ్రా చేసుకొని ఫర్వాలేదనిపించుకుంది. అయితే, బీసీసీఐ (BCCI), క్రికెటర్ల మధ్య గ్యాప్ ఏర్పడిందని, సరిగా సంభాషణ జరగడంలేదని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు. పుజారా వంటి ప్లేయర్ రిటైర్ అయినప్పుడు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు ఇవ్వలేదని మండిపడ్డారు. పుజారాకు గౌరవంగా వీడ్కోలు ఇవ్వాల్సి ఉన్నా బీసీసీఐ అలా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Survey on Modi: ప్రధాని మోదీ పాలనపై సర్వే.. జనాలు ఏమంటున్నారంటే?
ఒక ఆటగాడు దేశానికి 100 టెస్టులు ఆడితే, అతడు ఖచ్చితంగా గొప్ప ఆటగాడు అయ్యి ఉంటాడని, అలాంటి ప్లేయర్కు కచ్చితంగా మంచి వీడ్కోలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ల సమయంలో బీసీసీఐ వారితో మాట్లాడి ఉంటే బాగుండేదనిపిస్తోందని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అలాంటి సంభాషణే జరిగినట్టుగా అనిపించడంలేదన్నారు. ఇది భారత క్రికెట్కు మంచి సంకేతాలు ఇస్తున్నట్టు కాదన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో శ్రీకాంత్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కూడా ఇదే విధంగా ఉందన్నారు. కోహ్లీలో మరో రెండేళ్లు టెస్టు క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇంగ్లండ్తో సిరీస్ డ్రా అయిన తర్వాత కోహ్లీ గురించి మాట్లాడటం ఆగిపోయిందని, అయితే, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ దొరకడం అంత త్వరగా జరగదని చెప్పారు.
ఇంతకాలం భారత టెస్టు జట్టుకు కీలకంగా నిలిచిన పుజారాకు సరైన వీడ్కోలు లభించలేదని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘‘పుజారాను కూడా ముందుగా సంప్రదించి, అతడి రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఆటగాడు కూడా అతడి సమయం పూర్తయిందని గ్రహించి సహకరించాలి. అలా జరిగుంటే పుజారాకు మంచి వీడ్కోలు దక్కేదన్నది నా అభిప్రాయం. ఇది ఆటగాడు, సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుంది’’ శ్రీకాంత్ చెప్పారు.
కాగా, అద్భుతమైన టెస్ట్ కెరీర్కు ముగింపు పలికిన పుజారా, భవిష్యత్పై దృష్టి పెట్టాడు. నేరుగా ఆటకి కాస్త గ్యాప్ పెరిగినా క్రికెట్తో సంబంధం కొనసాగించాలని భావిస్తున్నట్టు పుజారా చెప్పాడు. ప్రసార కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. అదేవిధంగా, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లేదా బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్లో పనిచేయడానికి సంసిద్ధత చూపుతున్నాడు. కోచింగ్ లేదా ఎన్సీఏలో ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇదిలావుంచితే, భారత టెస్టు జట్టులో సీనియర్లు ఒకొక్కరిగా తప్పుకుంటుండటంతో కొత్త తరం మొదలైనట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.