New GST Rates: దేశ ప్రజలపై నిత్యావసరాల ధరల భారాన్ని కొంతమేర తగ్గించే లక్ష్యంతో నూతన, సరళీకృత జీఎస్టీ విధానాన్ని (New GST Rates) ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 12 శాతం, 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న వస్తువులను 5 శాతం, 18 శాతం స్లాబుల పరిధిలోకి తీసుకురాబోతున్నట్టు, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పన్నుల విధానంలో ఇది భారీ మార్పు అని, ఫలితంగా రోజువారీగా వినియోగించే పలు వస్తువుల రేట్లు తగ్గుతాయని అంటున్నాయి. ముఖ్యంగా, ఇప్పటివరకు 28 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్న వస్తువుల్లో సుమారు 90 శాతం మేర 18 శాతం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, 12 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్న అనేక వస్తువులు 5 శాతం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వవర్గాల సమాచారం.
రేట్లు తగ్గేవి ఇవేనా!
రోజువారీగా వినియోగించే వస్తువుల రేట్లు తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, ఈ జాబితాలో ఏయే వస్తువులు ఉండబోతున్నాయన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, టూత్పేస్ట్ నుంచి గొడుగుల వరకు, కుట్టుమెషిన్లు, ప్రెషర్ కుకర్లు, చిన్నపాటి వాషింగ్ మెషిన్లు వంటి చిన్నచిన్న గృహోపకరణాలు ఈ జాబితాలో ఉంటాయని తెలుస్తోంది. సైకిళ్లు, రెడీమేడ్ దుస్తులు (రూ. 1,000కి పైగా ధర ఉన్నవి), పాదరక్షలు (రూ. 500 – రూ.1,000 మధ్య రేటు ఉన్నవి), వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ సంబంధ పనిముట్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, హెయిర్ ఆయిల్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, పిల్లల స్కూల్ స్టేషనరీ కూడా ఈ జాబితాలో ఉండబోతున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, పండ్లు, కూరగాయలు, కొన్ని రకాల ధాన్యాలు, పాలు వంటి డెయిరీ ఉత్పత్తులు ఉంటాయని సమాచారం. విద్యపై జీఎస్టీ సున్నాగా ఉండనుంది.
18 శాతం జీఎస్టీ స్లాబులో ఏముంటాయి?
18 శాతం పన్ను స్లాబులో టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, సోడా, కోక్ వంటి పానీయాల కార్బనేట్ ఉన్న డ్రింక్స్, నిర్మాణ రంగంలో వాడే కొన్ని వస్తువులు, రెడీమిక్స్ కాంక్రీట్, సిమెంట్ వంటి వస్తువులు ఈ జాబితాలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
కార్లు, బైకుల సంగతేంతి?
నూతన జీఎస్టీ విధానంలో ప్యాసింజర్ వెహికిల్స్, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గుతుందని అంచనాగా ఉంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాలపై (కార్లు) జీఎస్టీ 28 శాతంగా ఉంది. అదనంగా సెస్ కూడా వసూలు చేస్తున్నారు. వాహనం ఇంజిన్ సామర్థ్యం, పొడవు, బాడీ టైపు ఆధారంగా 22 శాతం వరకు సెస్ ఉంటుంది. మొత్తంగా, కొన్ని కార్లపై ట్యాక్సులు దాదాపు 50 శాతం వరకు ఉంటున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ కేవలం 5 శాతంగానే ఉంటుంది. సెస్ విధించరు. ఇక బైక్స్ విషయానికి వస్తే, ప్రస్తుత జీఎస్టీ 28 శాతంగా ఉంది. ఇంజిన్ సామర్థ్యం 350సీసీ లోపు ఉన్న బైకులకు సెస్ విధించడం లేదు. 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్య ఉంటే 3 శాతం సెస్ విధిస్తున్నారు. అయితే, నూతన జీఎస్టీ విధానంలో వీటిని 28 శాతం జీఎస్టీ స్లాబు నుంచి తొలగించి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చే సూచనలుఉన్నాయి. అదే జరిగితే కార్లు, బైకులు కనీసం 10 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Read Also- Hyderabad Tragedy: శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ఐదుగురు మృతి
పొగాకు ఉత్పత్తులపై బాదుడే బాదుడు
అయితే, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 40 శాతం వరకు పెంచబోతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో సుమారు 5 నుంచి 7 వస్తువులే ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఇప్పటికే అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు చూస్తే, గుట్కా పొగాకుపై ప్రస్తుతం 160 శాతం శాతం విధిస్తున్నారు. సిగరెట్లపై అయితే జీఎస్టీ, సెస్, జాతీయ విపత్తు పన్ను (National Calamity Contingent Duty) వంటి పన్నులను కలిపి వసూలు చేస్తున్నారు. ఇక, వజ్రాలు, విలువైన రాళ్ల వంటి ఎగుమతులపై ప్రస్తుతం కొనసాగుతున్న పన్నులను కొనసాగించవనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఎప్పటిలాగే పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రాబోవు. నూతన జీఎస్టీ విధానంపై సెప్టెంబర్లో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఖరారుకానుంది. రేట్లు తగ్గితే వినియోగం పెరుగుతుందని అంచనాగా ఉంది. ఈ సరళీకరణ ద్వారా సుమారు కేంద్రానికి సుమారుగా రూ.50,000 కోట్లు మేర రాబడి తగ్గే అవకాశం ఉండొచ్చని అంచనాగా ఉంది.