Rave Party: మొయినాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీ(Rave party)ని పోలీసులు భగ్నం చేశారు. దావత్ చేసుకుంటున్న 51మంది ఆఫ్రికన్ దేశాలకు చెందిన యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్, మద్యం వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్ పరీక్షలు జరిపారు. వీరిలో కొందరికి పాజిటీవ్ వచ్చినట్టుగా సమాచారం. ఇక, తనిఖీల్లో భారీ ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పలువురు వీసా(Veesa) గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు నిర్ధారణ కావటం గమనార్హం. వీరందరినీ వారి వారి దేశాలకు తిప్పి పంపించాలని అధికారులు నిర్ణయించారు. .
ఉగాండా దేశస్తురాలి బర్త్ డే
ఉగాండా(Uganda) దేశానికి చెందిన మమాస్ తన పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ జరుపుకోవటానికి మొయినాబాద్ బాకారం జాగీర్ లోని ఎస్కే ఫార్మ్ హౌస్(SK Farm House) ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసింది. ఆ తరువాత ఉగాండా, సినియన్, కెన్యా, నైజీరియా దేశాలకు చెందిన స్నేహితులను వేడుకలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో 31మంది యువకులు, 14మంది యువతులు గురువారం మధ్యాహ్నమే ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు.
డీజే సౌండ్లు…చిందులు
సాయంత్రం నుంచి భారీ శబ్ధంతో డీజేలు మోగిస్తూ డ్యాన్సులు చేస్తూ పార్టీ చేసుకోవటం మొదలు పెట్టారు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎస్వోటీ అధికారులు, మొయినాబాద్ పోలీసులు గురువారం రాత్రి దాడి జరిపారు. అయితే, పార్టీలో ఉన్న ఆఫ్రికన్ దేశాల యువకులు, యువతులు పోలీసులను అడ్డుకోవటానికి ప్రయత్నించారు. వారితో వాగ్వావాదానికి దిగారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో అదనపు బలగాలను అక్కడికి రప్పించారు.
భారీగా మద్యం సీజ్
ఫార్మ్ హౌస్ లో తనిఖీలు జరిపిన పోలీసులు భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 20 లీటర్ల విదేశీ, స్వదేశీ మద్యంతోపాటు 65 బీరు బాటిళ్లను సీజ్ చేశారు. హుక్కా పాట్లు, ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురు డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తం కావటంతో అందరికీ డ్రగ్ పరీక్షలు జరిపించారు.
Also Read: Gun Culture Hyderabad: గర్జిస్తున్న అక్రమ ఆయుధాలు.. వరుస ఘటనలతో జనం బెంబేలు
ఇమ్మిగ్రేషన్ అధికారులతో చెకింగ్
ఇక, ఫార్మ్ హౌస్ కు ఇమ్మిగ్రేషన్ అధికారులను పిలిపించిన పోలీసులు అక్కడ దొరికిన ఆఫ్రికన్ దేశస్తుల పాస్ పోర్టులు, వీసాల వివరాలను చెక్ చేయించారు. ఈ క్రమంలో పలువురు వీసా గడువు ముగిసినా ఇక్కడ అక్రమంగా ఉంటున్నట్టుగా వెల్లడైంది. బర్త్ డే పార్టీ ఇచ్చిన మమాస్ కూడా అక్రమంగా ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇలా అక్రమంగా ఉంటున్న వారందరినీ వారి వారి దేశాలకు వెనక్కి పంపించటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎలాంటి అనుమతులు తీసుకోలేదు…డీసీపీ
ఇక, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఫార్మ్ హౌస్ కు వచ్చి తనిఖీలను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్ద శబ్ధంతో పార్టీ చేసుకుంటున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు దాడులు చేసినట్టు చెప్పారు. దీంట్లో 37మంది యువకులు, 14మంది యువతులు దొరికారని, అందరూ ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే అని చెప్పారు. మద్యం పార్టీ జరుపుకోవటానికి ఎక్సయిజ్, స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. దీనిపై కేసులు నమోదు చేశామన్నారు. సౌండ్ వాయిలేషన్ ప్రకారం కూడా కేసులు పెట్టామన్నారు. దొరికిన 51మందిలో 12మంది విద్యార్థులు ఉన్నట్టుగా విచారణలో తేలిందన్నారు.
అందరికీ డ్రగ్ పరీక్షలు
ఇక, పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అందరికీ డ్రగ్ పరీక్షలు జరిపించినట్టు డీసీపీ శ్రీనివాస్(DCP Srinivass) చెప్పారు. ఇక, 19మంది నైజీరియన్లు వీసా గడువు ముగిసినా ఉంటున్నట్టు వెల్లడైందన్నారు. వీరందరినీ వారి వారి దేశాలకు వెనక్కి పంపించి వేస్తామని చెప్పారు.
Also Read: DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!