Fake Documents: వడ్డించేవాడు మనోడు అయితే..అన్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారమే పెట్టుబడిగా కొందరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. గత పాలనలో రెవిన్యూ అధికారులు, సిబ్బంది దళారులతో అంటకాగి ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి అప్పనంగా ధారాదత్తం చేశారు. ఏకంగా జీవో 58 కింద క్రమబద్దీకరించుకున్నట్లు పత్రాలు సృష్టించి కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కాజేసి భారీ భవంతులను నిర్మిస్తుండగా..మరికొందరు పేదల భూములను ఆక్రమిస్తున్నారు. హైటెక్ మండలంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి ప్రాంతంలో నకిలీ పట్టాల ఉదంతాలు రోజుకొకటి వెలుగు జూస్తుండడం విస్మయం గొలుపుతోంది.
నకిలీ పట్టాలతో అనుమతులు
గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 58 రెగ్యులరైజేషన్ చట్టాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వం జీవో 58లో భాగంగా ఇచ్చిన పాత పట్టాలకు నకిలీలను సృష్టించి..ఆ నకిలీ పత్రాలతో నిర్మాణ అనుమతులు పొంది కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆయా నకిలీలతో రిజిస్ట్రేషన్ లేని స్థలాలకు ఇంటి నెంబర్లు, అనుమతులను అధికారులు గుడ్డిగా మంజూరు చేస్తున్నారు. ఈ తరహా అక్రమాలు పెద్ద సంఖ్యలో శేరిలింగంపల్లి ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి.
గత మూడు నెలల క్రితమే అంజయ్యనగర్ లో నకిలీ పట్టాలతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు పొంది పార్కు స్థలం కబ్జాకు కొందరు యత్నించారు. స్థానిక రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు సైతం నమోదైంది. తాజాగా అంజయ్యనగర్ లోనే మరో నకిలీ పట్టా వెలుగు చూడడం సంచలనం రేపుతోంది. నకిలీ పట్టాతో ఓ వ్యక్తి పేదల ఇంటి మీద దాడి చేసి కబ్జాకు యత్నించడంతో పాటు కోర్టును సైతం నకిలీ పట్టాతో తప్పుదోవ పట్టించాడు.
Aslo Read: Serilingampalli: నకిలీ పత్రాలతో వేరొకరి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం.. భవనం సీజ్!
ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి
శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నెంబరు 135,136లలో ఉన్న అంజయ్యనగర్ కాలనీలో ఓ వ్యక్తి గత 20ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న ఇంటికి జీహెచ్ఎంసీ నుంచి ఇంటినెంబరు 209/136/1/ఏ ను తీసుకొని ట్యాక్స్ చెల్లిస్తున్నారు. సదరు ఇంటికి విద్యుత్ కనెక్షన్, మంజీరా కనెక్షన్ తీసుకున్నాడు. కాగా కొన్ని నెలల క్రితం వీరి ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తి సదరు స్థలం తనదంటూ ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. సదరు స్థలం తనకు జీఓ 58 కింద రెగ్యులరైజేషన్ ఫైల్ నెంబరు బి/30/2015లోని పట్టానెంబరు బిపిఎల్ఆర్ఆర్ డి 2150604150791తో షేక్ చాంద్ పాషా పేరు మీద జారీ అయిన పట్టాను చూపించాడు.
2015లో తనకు పట్టా జారీ అయ్యిందంటూ అదే పట్టాతో కోర్టులో కేసు వేశాడు. ఎన్నో ఎళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంటిపై మరొకరికి పట్టాలను మంజూరు చేయడంపై బాధితుడు విస్తుపోయాడు. సదరు పట్టా జారీపై వివరాలు వెల్లడించాలని సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. కబ్జాదారుడు చూపిస్తున్న సదరు పట్టా తమ కార్యాలయం జారీ చేయలేదని, అసలు పట్టాలో పేర్కొన్న ఫైల్ లోని సీరియల్ నెంబర్ 30ని సీ సెక్షన్ ఆర్టీఐ యాక్ట్ దరఖాస్తుల కోసం కేటాయించినట్లు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆర్టీఐ దరఖాస్తుల కోసం కేటాయించిన సీరియల్ నెంబరుతో నకిలీ జీఓ 58 పట్టాను సృషించినట్లు తేటతెల్లమైంది.
Also Raed: Medak District SP: మొబైల్ ఫోన్ రికవరీ లో.. తెలంగాణ మొదటి స్థానం!
రెవెన్యూ అధికారులు మౌనం
శేరిలింగంపల్లి ప్రాంతంలో నకిలీ పట్టాల బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. నకిలీ పట్టా సర్టిఫికెట్లు మండల పరిధిలో కోకొల్లలుగా చెలామణి కావడం చర్చనీయాంశంగా మారింది. గత రెవెన్యూ అధికారుల తప్పిదాల కారణంగానే మంజూరు చేయని పట్టా కాపీలు అక్రమార్కుల చేతుల్లో పడ్డాయని తెలుస్తోంది. వీటికి అడ్డగోలుగా అనుమతులను సైతం పొంది విలువైన స్థలాలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు.
అయితే నకిలీ బాగోతాలు వెలుగుజూశాక కూడా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు నెలల క్రితం సైతం నకిలీ పట్టాలు సృష్టించి అంజయ్యనగర్ లో పార్కు స్థలాన్ని కబ్జా చేసి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది భారీ బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టడంపై పోలీసు కేసు నమోదైనప్పటికీ అక్రమ నిర్మాణం యథేచ్చగా సాగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. తాజాగా.. అంజయ్య నగర్లో బయటపడ్డ మరో నకిలీ పట్టా ఉదంతంలోనూ రెవెన్యూ అధికారులు బాధితుడికి ఆర్టీఐ దరఖాస్తు కింద వివరణ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎన్నో అనుమానాలను తావిస్తోంది.
Also Read: MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావు ఆక్రమణలో పేదల భూములు.. అన్యాయం చేశారు!