Mynampally Rohit Rao: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని, ఇది మహిళలు, రైతుల పక్షపాతి అయిన ప్రజా ప్రభుత్వం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా, శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన అదనపు కలెక్టర్ నాగేశ్తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రూ. 30 కోట్ల రుణాల పంపిణీ
మెదక్ జిల్లాకు సంబంధించి ₹30 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను, మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ₹2 కోట్ల 88 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చిన్న శంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందించారు.
Also READ: MLA Mynampally Rohit: ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
కోటీశ్వరులు చేయడమే సంకల్పం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా, మరోసారి రాష్ట్రంలోని 3 లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు ₹304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నదని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో విడత పంపిణీ అని, ఈ కార్యక్రమానికి మంగళవారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టిందని తెలిపారు.
మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, వారి కాళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేశ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Mahender Reddy: రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్గా మహేందర్ రెడ్డి

