హనుమకొండ, స్వేచ్ఛ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల తుపాకుల కలకలం కేసుల్లో నిందితులైన సూరి అలియాస్ సురేందర్ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సూరి గ్యాంగ్ అరెస్ట్కు సంబందించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 18న సూరి అలియాస్ సురేందర్ గ్యాంగ్ శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పరకాల – హనుమకొండ ప్రధాన రహదారిపై ఓ లారీని ఆపి డ్రైవర్ను తుపాకీతో బెదిరించారని తెలిపారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సమీపంలోని పెట్రోల్ బంకులో ఇంధనం పోయించుకొని డబ్బు ఇవ్వకుండా నిర్వాహకులను గన్ చూపించి బెదిరించారని, ఈ రెండు కేసులకు సంబంధించి సూరి అతడితో పాటు ఉన్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన సూరి అలియాస్ సురేందర్గా పోలీసులు నిర్దారించారు. అతడిపై గతంలో 45 క్రిమినల్ కేసులు, మూడు పీడీ యాక్ట్ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. గత 4 నెలల నుంచి అతడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఏర్పరచుకున్నాడని, కొంతమంది విద్యార్థులను చేరదీసి గ్యాంగ్గా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా తేలిందన్నారు. సెప్టెంబర్ 18న జరిగిన ఘటనను చేధించేందుకు సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ముఠా కోసం గాలించినట్టు అధికారులు వివరించారు. గురువారం పోలీసులకు అనుమానస్పదంగా ఉన్న సురేందర్, అతడి గ్యాంగ్ పట్టుకున్నామని తెలిపారు.
Read Also- Mrutyunjaya Yagna: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆకాంక్షిస్తూ.. సంగారెడ్డి జిల్లాలో మృత్యుంజయ యజ్ఞం
కాగా, చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు బీహార్కు చెందిన ఠాకూర్తో సూరి పరిచయం ఏర్పరచుకోవడంతో బీహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ (తుపాకులు) కొని, వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. భూపాలపల్లిలో పలువురిని హతమార్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి సూరి బహిష్కరణకు గురయ్యాడని, సూరి అతడి గ్యాంగ్ చేయబోయే నేరాలను ముందే అడ్డుకున్నట్లు వివరించారు.
