Sri Venkateswara Crackers: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్(Sri Venkateswara Crackers) పటాకుల దుకాణం ప్రస్తుతం ప్రజల్లో దదపుట్టిస్తుంది. హోల్సేల్(Hole Sale) అనుమతులు తీసుకొని, రిటైల్ వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. అధికార అనుమతులు పొందినప్పుడు కేవలం రిటైల్ షాప్ లకు మాత్రమే సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ రోజువారీగా సాధారణ వినియోగదారులకు పటాకులు అమ్మడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ కు అనుకొని క్రాకర్స్ దుకాణం
ఈ దుకాణం ఉన్న ప్రదేశం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అతి సమీపంలో ఉంది. అగ్ని ప్రమాదం జరిగితే కేవలం దుకాణం మాత్రమే కాదు, పక్కనే ఉన్న అడవి ప్రాంతం, వృక్ష సంపద,వన్య ప్రాణులు సమీప గ్రామాలు కూడా ముప్పులో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ(Fire Safety) నిబంధనల ప్రకారం ఇటువంటి వ్యాపారాలు నివాస ప్రాంతాలకు ,పెట్రోల్ బంక్కులకు, విద్యాసంస్థలకు మరియు రిజర్వ్ ఫారెస్ట్కి కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలని సూచనలున్నాయి. కానీ ఇక్కడ ఆ నియమాలను పూర్తిగా పట్టించుకోవడం లేదు.
అనుమతికి మించి సరుకు నిల్వ
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ గోదాంలో 20 నుండి 35 టన్నుల వరకు పటాకుల నిల్వ ఉంది. హోల్సేల్ అనుమతి ఉన్నా, ఇది సేఫ్టీ లిమిట్(Safety Limit) కంటే ఎక్కువ మొత్తంలో స్టాక్ నిల్వలు ఉంచుతూ నిబంధనలకు విరుధంగా వేపర్ కలపాలు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చిన్న స్పార్క్ జరిగితే భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉందని ఫైర్ అధికారుల వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పటాకుల గోదాం ప్రమాదాలు అందరికీ గుర్తుండే విషయమే. అయినప్పటికీ ఇలాంటి ఘటనల నుండి పాఠాలు నేర్చుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
Also Read: Kalvakuntla Kavitha: జాగృతిలో భారీగా చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత
ప్రజల్లో భయాందోళన –కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పటాసుల దుకాణం ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని సమీప ప్రాంత నివాసులు చెబుతున్నారు.
ఇక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముడుపులు మట్టడంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ప్రజలు బహిర్గతం గానే ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫైర్ సేఫ్టీ నిపుణుల హెచ్చరిక
ఫైర్ సేఫ్టీ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే పటాకుల నిల్వ ప్రాంతం అనేది అత్యంత సురక్షిత దూరంలో ఉండాలి.పరిమిత స్టాక్ మాత్రమే షాపులో వుండాలని మిగతా స్టాక్ అంతా గోదాంలో నిల్వ ఉంచాలని, ప్రతి గోదాంలో సేఫ్టీ పరికరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వెంటిలేషన్ తప్పనిసరి. లేదంటే ఒక్క స్పార్క్ పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు తెలిపినప్పటికీ అవేమీపట్టనట్లు. ఇక్కడ భద్రతా ప్రమాణాలేవీ కనిపించడం లేదు. దీనిపై స్థానిక పౌర సంఘాలు, సామాజిక సంస్థలు తక్షణమే అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న చోట వ్యాపారం అనుమతించడం ఏంటని అనే ప్రశ్న ఇప్పుడు పాల్వంచ ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది.
Also Read: KTR: మెడికల్ డివైస్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం: కేటీఆర్
