Govt On Parents: తల్లిదండ్రుల తర్వాతే దైవం ప్రత్యక్ష దైవాలైన వీరు మలిసంధ్యలో పడరాని పాట్లు పడుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసి వారి బంగారు భవిష్యత్ కోసం శ్రమిస్తే వృద్ధాప్యంలో వారిని పట్టించుకోవడం లేదు. రెక్కలొచ్చిన కొడుకులకు కన్నవారు బరువైపోతున్నారు. రక్త బంధాన్ని తెంచుకుని ముసలి తల్లిదండ్రు(Parents)లను రోడ్డపై వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం డివిజన్ స్థాయిలో ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. వృద్ధులైన తల్లిదండ్రుల(Parents)ను వీదిపాలు చేస్తే కొడుకులు కటకటాలు లెక్క పెట్టాల్సిందే.
Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు
వృద్ధాశ్రమాల్లో చేర్పించి..
కోట్లు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రుల(Parents)కు తనయులు పట్టెడు అన్నం పెట్టడం లేదు. అయినవారికి దూరంగా ఉంటూ జీవనం గడుపుతున్న వారి గాథలు కన్నీళ్లు తెప్పించక మానవు. జీవిత చరమాంకంలో ఆదుకోవాల్సిన తనయులు వదిలేస్తున్నారు. వయోభారంతో వృద్ధులు అవస్థలు పడి విసిగిపోయి న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొందరు కుమారులు తెలివిగా వృద్ధాశ్రమంలో చేర్పించి
చేతులు దులుపుకుంటున్నారు.
విస్మరిస్తే క్రిమినల్ కేసులు
వృద్ధుల సంపూర్ణ బాధ్యత ఉన్న వ్యక్తులెవరైనా అందుకు విరుద్ధంగా శాశ్వతంగా వదిలించుకునే ఉద్దే శంతో ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టినా, వారికి హాని తలపెట్టినా 3 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ అమలు కావచ్చు.
వయోవృద్ధుల సంక్షేమ చట్టం
వయోవృద్దుల పోషణ సంక్షేమ చట్టం-2007 ప్రకారం కన్నవారిని విస్మరిస్తే జైలు కూడు తినాల్సిందే. మలిసంధ్యలో ఆదరించాల్సిన కుమారులు వారిని పట్టించుకోపోతే ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ చట్టం ప్రకారం తల్లి, తండ్రి, సవతి తండ్రి/ తల్లిని వయో వృద్ధుల కింద పరిగణిస్తారు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి
చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ డివిజన్ల వారీగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అక్కడ డివిజన్ ప్రిసైడింగ్ అధికారిగా ఆర్టీవో వ్యవహరిస్తారు. వృద్ధుల సంఘం నుంచి ఒక ప్రతినిది, కౌన్సిలేషన్ అధికారి ఉంటారు. సంబంధిత డివిజన్ కార్యాలయంలో వృద్ధులు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్టీవో సంబంధిత తహసీల్దారు విచారణకు ఆదేశిస్తారు. ఇరు వర్గాలను పిలిచి వాదనలు విని న్యాయం చేస్తారు. వినని పక్షంలో కౌన్సిలేషన్ అధికారికి అనుసందానం చేస్తారు. ఆయన ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా అప్పిలేట్ అధికారి కలెక్టర్ ను ఆశ్రయించవచ్చు. వృద్ధులే కాకుండా ఎన్జీవోలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేవారు నిర్ణీత ఫామ్ పూర్తి చేసి డివిజన్ రెవెన్యూ అధికారికి అందించాలి.
ప్రయోజనం ఇలా..
సొంత సంపాదనతో తమను తాము పోషించుకోలేని వృద్ధులు ఈ చట్ట ప్రకారం తమ పిల్లలను, సంతానం లేని వృద్ధులు వారి ఆస్తిని అనుభవించే బంధువులను పోషణ గురించి అడగవచ్చు. పోషణ ఖర్చులో ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య సహాయం, చికిత్సకు అవసరమైన మొత్తం నెలకు రూ.10 వేలకు మించకుండా అందేలా ట్రిబ్యునల్
చర్యలు తీసుకుంటుంది. వివిధ దినపత్రికల్లో వచ్చే వృద్ధుల కథనాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పత్రికల కథనాలపై జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యా లయం సంబంధిత తహసీల్దార్లకు సమాచారం ఇస్తుంది. తహసీల్దార్ వాస్తవ నివేదికను రూపాందించి ఆర్డీవోకు నివేదిస్తారు. అధికారులు ఇరువర్గాలను పిలిచి రాజీ కుదర్చడమో,కేసు నమోదు చేయడమో నిర్ణయిస్తారు..
పెరుగుతున్న ఫిర్యాదులు
తల్లిదండ్రులు తమ పిల్లలని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయగా వారు ప్రయోజకులు అయిన అనంతరం వారిని భారంగా భావిస్తున్నారు.ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి భూమిని లాక్కొని ఇంటి నుంచి పంపిన ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హుస్సేన్ బీ కి కుమారులు ఉండగా భర్త చనిపోవడంతో ఆమె పేరిట ఆస్తి కలిగి ఉంది. ఆసరాగా ఉన్న ఆ ఆస్తిని సైతం గ్రామంలో ఉండే కొడుకు, కోడలు తమ పేరిట చేయించుకుని లేనిపోని నిందలు మోపుతూ ఇంటి నుంచి గెంటేయగా సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు సహకారంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.
ఉండవెల్లి మండలం కలుగుట్లకి చెందిన కురువ లక్ష్మీదేవి అనే వృద్ధురాలి ఆస్తిపై వచ్చే పైసల కోసం ఇద్దరు కొడుకులు తరచుగా వాదనలు చేయడంతో పాటు దాడి చేసే పరిస్థితి ఉండడంతో ఆ వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మల్లకల్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు ఆ వృద్ధురాలి పొలాన్ని మంచిగా చూసుకుంటామని మాయ మాటలు చెప్పి రిజిస్టర్ చేయించుకున్నానంతరం ఆమెను పట్టించుకోకపోవడంతో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించడంతో నాలుగవ కుమారుడు ఆమె బాగోగులు చూసుకునేందుకు ముందుకు వచ్చాడు తీరా సంవత్సరం తర్వాత అతను సైతం నాకు ఆస్తి ఇవ్వలేదు నా పరిస్థితి సైతం బాగోలేదని ఇంటి నుంచి పంపాడు దీంతో ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి తన గోడును చెప్పుకొని నా స్త్రీ నాకు చేయాలని కలెక్టర్ ను మొరపెట్టుకుంది.
బాధితులు ముందుకు రావాలి : మోహన్ రావు, సీనియర్ సిటిజన్ ఫోరం
నేటి సమాజంలో తమ తల్లిదండ్రులపై పిల్లలు చిన్న చూపు చూడడం శోచనీయం. ఎవరైనా వృద్ధులని ఇబ్బందులు పెట్టినట్లయితే ముందుకు రావాలి. వారికి సీనియర్ సిటిజన్ ఫోరం బాసటగా నిలుస్తుంది. కలెక్టర్ లేదా ఆర్ డి ఓ కు ఫిర్యాదు చేయడం ద్వారా సత్వరమే వారికి న్యాయం జరుగుతుంది. సంబంధితలకు నోటీసులు పంపి కేవలం మూడు నెలల్లోనే వారికి భూ పరిష్కారంతో పాటు ఆర్థిక సహకారం అందేలా జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం తరపున సేవలు అందిస్తామని మోహన్ రావు తెలిపారు.
Also Read: Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు