Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ఉచ్ఛులో చిక్కుకుని లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్న విషాదాలు కూడా ఉన్నాయి. అయితే, కరీంనగర్(Karimnagar) కు చెందిన ఇద్దరు యువకులు ఆన్ లైన్ లో బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్న వారికే టోకరా ఇచ్చారు. పకడ్భంధీ పథకం ప్రకారం తమ వాళ్లతోనే బెట్టింగులు పెట్టిస్తూ ఓడిపోయిన వారి ఖాతాల్లో జమయ్యే డబ్బును కొట్టేస్తూ వచ్చారు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 30 లక్షల రూపాయలను కొల్లగొట్టారు.
టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు(DCP Ande Srinivasa Rao) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్(Karimnagar) కు చెందిన రాజేశ్, అస్లంలు కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వేర్వేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో బెట్టింగులు నిర్వహిస్తున్న ఖేలో గేమ్ వెబ్ అప్లికేషన్ వీరి కంట పడింది. ఖేల్ స్టార్, ఖేలో 24, ఖేలో ఎక్స్ ఛేంజ్, ఖేలో స్పోర్ట్స్, విన్ మ్యాచ్ తదితర ఆన్ లైన్ మొబైల్ యాప్ ల ద్వారా నిర్వాహకులు బెట్టింగులు స్వీకరిస్తున్నట్టు తెలుసుకున్నారు.
Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోనస్ ఆఫర్ చూసి…
ఇక, ఖేలో గేమ్ అప్లికేషన్ నిర్వాహకులు బెట్టింగుల్లో డబ్బు ఓడి పోయినవారి ఖాతాల్లో బోనస్ కింద అయిదు నుంచి పదిహేను వేల రూపాయల వరకు జమ చేస్తున్నట్టు రాజేశ్, అస్లంలకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఖేలో గేమ్ అప్లికేషన్ నిర్వాహకులకు టోపీ పెట్టాలని ఇద్దరు కలిసి పథకం రూపొందించారు. దాని ప్రకారం ఉద్యోగాలు వెతుక్కుంటూ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వినయ్ కుమార్, సాయివర్ధన్ గౌడ్, రాహుల్, జెశ్వంత్, జోడ వేణు గోపాల్, కోల రామ్, వేల్పుల ఆకాశ్, ప్రణయ్ లతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ ఒక్కరితో బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఆ తరువాత అందరికీ మొబైల్ ఫోన్లు ఇప్పించారు. ఐడీలు, పాస్ వర్డులు తయారు చేసి ఇచ్చారు.
వేర్వేరు ఐడీలతో…
ఆ తరువాత గ్యాంగ్ సభ్యులతోనే ఖేలో గేమ్ అప్లికేషన్ లో పెద్ద పెద్ద మొత్తాల్లో బెట్టింగులు పెట్టించటం మొదలు పెట్టారు. చిత్తూ బొత్తును పోలి ఉండే ఈ గేమ్ లో డబ్బు పోగొట్టుకున్న వారి ఖాతాల్లోకి అప్లికేషన్ నిర్వాహకులు అయిదు నుంచి పదిహేను వేల రూపాయలు క్రెడిట్ చేసేవారు. ఈ క్రమంలో ఓడిపోయిన వారి ఖాతాల్లోకి నిరంతరం డబ్బు జమ అవుతూ వచ్చింది. దానిని రాజేశ్, అస్లంలు విత్ డ్రా చేసుకుని కమీషన్ గా కొంత మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులకు ఇస్తూ వస్తున్నారు. ఇలా కొన్ని రోజుల్లోనే ఖేలో గేమ్ అప్లికేషన్ నిర్వాహకులకు 30లక్షల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టారు.
పక్కా సమాచారంతో…
కాగా, ఈ గ్యాంగ్ సాగిస్తున్న దందా గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఎస్ఐలు మహ్మద్ సమీవుజ్ జమా, మహేశ్, నవీన్ తోపాటు సంజీవరెడ్డినగర్ పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. సంజీవరెడ్డినగర్ లోని నాగార్జున స్కూల్ వద్ద ముఠాలో సభ్యులుగా ఉన్న వినయ్ కుమార్, సాయివర్ధన్ గౌడ్, రాహుల్, జెశ్వంత్, జోడ వేణు గోపాల్, కోల రామ్, వేల్పుల ఆకాశ్, ప్రణయ్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు రాజేశ్, అస్లం కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్లు, 3 బ్యాంక్ పాస్ బుక్కులు, 13 ఏటీఎం కార్డులు, ఆన్ లైన్ లో ఉన్న 29.81లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Rashid Khan: చరిత్ర తిరగరాసిన అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ప్రపంచంలో ఏ ఆటగాడికీ సాధ్యంకాలేదు