Damodar Rajanarsimha: భారీ వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని గర్భిణులను, ముఖ్యంగా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్కు దగ్గరలో ఉన్నవారిని వెంటనే ప్రభుత్వ దవాఖానల వెయిటింగ్ రూమ్లకు తరలించాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబులెన్స్లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, డ్రైవర్లు, ఈఎంటీలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, గాలుల వల్ల విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రమాదం ఉన్నందున, ఆసుపత్రులలోని జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.’
Also Read: BJP Telangana: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జిల్లాల్లో పర్యటనలు..
మంత్రి ఆదేశాలతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణతో పాటు టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, (Ravindra Nayak) మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు తదితరులు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రివెంటివ్ మెజర్స్పై దృష్టి సారించాలని, కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లను అలెర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు.
అవగాహన, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, యాంటిలార్వల్ ఆపరేషన్స్, ఫాగింగ్, ఇండోర్ స్ప్రేయింగ్ విస్తృతంగా చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా మంచి నీటి నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, ఓపీ కౌంటర్లను పెంచాలని, అవసరమైతే ఓపీ టైమింగ్స్ను పొడిగించుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల మెడిసిన్స్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, టెస్టింగ్ కిట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇన్పేషెంట్లు, అవుట్పేషెంట్లకు అవసరమైన అన్ని టెస్టులు ఆసుపత్రులలోనే చేయాలన్నారు. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లపై పర్యవేక్షణ పెంచి, అన్ని రకాల టెస్టులు చేయడంతోపాటు, అదేరోజు పేషెంట్లకు రిపోర్టులు అందజేయాలన్నారు.
ఆహారం నిఘా..
ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్, డైట్ నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఫుడ్ ఇన్స్పెక్టర్లు దవాఖానల్లో తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. వార్డులు, వాష్రూమ్లు పరిశుభ్రంగా లేకపోయినా, పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాధారణ ప్రజలు కూడా ఇంట్లోనే తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్స్లో ఆహారం తినాల్సి వస్తే, శుభ్రత పాటించే హోటల్స్నే ఎంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో జిల్లా, రాష్ట్రస్థాయి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రెగ్యులర్గా తనిఖీలు చేయాలన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్లెట్స్ పేరుతో ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్లులు అధికంగా వేసే ఆస్పత్రులపై నిబంధనల ప్రకారం వ్యవహరించి, పేషెంట్లను దోచుకోకుండా చూడాలన్నారు. చివరగా, రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నందున, రైతులు పొలాల్లో ఎక్కువ సమయం గడుపుతారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు అన్ని దవాఖానల్లో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు.
Also Read: Rahul Gandhi: తెలంగాణ దేశానికే మైలు రాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు