RTA Corruption: జనగాం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో దళారులను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు అక్రమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఉన్నతాధికారులకు, రవాణా శాఖ మంత్రికి సైతం ఫిర్యాదులు చేస్తున్నా, వారిపై పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు దారితీస్తుంది.
దళారులు లేకుండా పని జరగదు
జనగాం ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్లు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, ట్రాక్టర్ ట్రాలీ రిజిస్ట్రేషన్లు, సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి ప్రతి పనికీ మధ్యవర్తులు ఉంటేనే కార్యాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు చెల్లించినా, అధికారులు ఏవో సాకులు చెప్పి కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బాధితులు అదనంగా కనీసం రూ. 2 వేలు ఆపైన ముట్టజెప్పితేనే పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ అధికారులు ప్రతిరోజూ వేల రూపాయల్లో అక్రమంగా వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
Also Read: NBK 111: ప్రారంభమైన బాలయ్యబాబు ‘NBK111’ షూటింగ్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?
రెండు నెలల క్రితం సీజ్ చేసిన ఒక ట్రాక్టర్ విడుదలకు సంబంధించి ఏకంగా ఒక ఎమ్మెల్యే సైతం ఓ అధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆ అధికారి ట్రాక్టర్ను వెంటనే విడుదల చేయకుండా సాకులు చెప్పడంతో, బాధితుడు చేతిని తడిపి ట్రాక్టర్ను రిలీజ్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాదు, కొంతమంది బాధితులు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను సైతం ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే ఆ అధికారులు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
పర్యవేక్షణ లోపమే కారణమా?
ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువవడంతో, ఈ అక్రమ కార్యకలాపాలు అధికారులకు తెలియకుండా మధ్యవర్తులే మేనేజ్ చేస్తున్నారా? లేక అధికారులకు తెలిసే దందా జరుగుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బాధితులు అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని విజ్ఞప్తులు చేస్తున్నా, ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ఉద్యోగుల్లోనూ చర్చకు దారితీసింది. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు మాత్రమే మధ్యవర్తులకు కార్యాలయంలోకి ప్రవేశం ఉండటం లేదని, ఆ తర్వాత మళ్లీ యథావిధిగా అక్రమ దందా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: YS Jagan on AP Govt: అరటి రైతులకు అండగా జగన్.. కూటమి సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్..!
