Huzurabad: హుజూరాబాద్లోని సహాయ కార్మిక అధికారి కార్యాలయం అవినీతికి నిలయంగా, అక్రమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆరు మండలాల పరిధిలోని వేలాది మంది కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన ఈ విభాగం, అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రైవేట్ వ్యక్తుల పెత్తనంతో పతనమవుతోంది. ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక ప్రైవేట్ వ్యక్తుల దందా కేంద్రమా అన్నట్లుగా ఇక్కడి పరిస్థితులు తయారయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ వ్యక్తుల హల్చల్
సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, (Huzurabad) జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల బాధ్యతలు చూసే ఈ కార్యాలయంలో సహాయ కార్మిక అధికారి (ALO) చందన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటలకే తెరుచుకోవాల్సిన కార్యాలయం, మధ్యాహ్నం 12 గంటలు దాటితే గానీ తాళాలు తీయడం లేదు. అధికారిణి ఆలస్యంగా వచ్చి, సాయంత్రం 4 గంటలకే వెనుదిరుగుతుండటంతో దూర ప్రాంతాల నుండి వచ్చే కార్మికులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
Also Read: Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి.. ఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదే!
ప్రభుత్వ రహస్యాలు గాలికి – బయటి వ్యక్తుల చేతిలో కీలక సమాచారం
అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారికి, అక్కడి కింది స్థాయి సిబ్బందికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని, ఒక ప్రైవేట్ వ్యక్తిని కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రభుత్వ అధికారిక లాగిన్ వివరాలు, సంకేతపదాలు (Passwords) అతనికి అప్పగించారు. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్యమైన దస్త్రాలను, కార్మికుల సమాచారాన్ని ఒక అనామకుడి చేతిలో పెట్టడం చట్టరీత్యా నేరమని తెలిసినా అధికారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు.
అడ్డగోలు వసూళ్లు – కార్మికుల రక్తం తాగుతున్న దళారులు
భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేయడానికి కూడా రూ. 300 నుండి రూ. 800 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు లేని సమయంలో ఆ ప్రైవేట్ వ్యక్తే సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారు. ఏఎల్ఓ (ALO) మీ-సేవ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాహ కానుక, ప్రసవ కానుక, ప్రమాద మరియు మరణ పరిహారాలకు సంబంధించిన దస్త్రాలను కదిలించాలంటే వేలల్లో లంచం సమర్పించుకోవాల్సిందే. డబ్బులు ఇస్తేనే ఉన్నతాధికారులకు దస్త్రాలను పంపిస్తామని కార్మికులను నిలువునా దోచుకుంటున్నారు.
జిల్లా అధికారుల మౌనం.. అంతా లోపాయికారీ ఒప్పందమేనా?
హుజూరాబాద్ కార్యాలయంలో జరుగుతున్న ఈ దారుణాలపై నిత్యం వార్తలు వస్తున్నా, కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (DCL) మరియు వరంగల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (JCL) వంటి ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంతటి ఆధారాలతో వార్తలు వస్తున్నా విచారణ జరపకపోవడం చూస్తుంటే, ఈ అక్రమ వసూళ్లలో పైస్థాయి అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక శాఖలో వేళ్లూనుకున్న ఈ అవినీతిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి. విధులను నిర్లక్ష్యం చేస్తున్న అధికారిణిపై, ప్రభుత్వ రహస్యాలను బయటి వ్యక్తులకు అప్పగించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

