Eco Tourism: ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ లాంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు, అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున మనకు ఉన్న వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) మాట్లాడుతూ, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్న ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళ్తున్నారన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వరంగల్లో జూను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయపడిన వారికి, పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
టవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ
సీఎంఆర్ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలన్నారు. అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలోనూ అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధించాలన్నారు. అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్రదించాలని సీఎస్కు సూచించారు. అటవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. శాఖలో ఉత్తమ పని తీరు కనబర్చుతున్న వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ