Electrocution Tragedy: ప్రాణం చాలా విలువైనది. వినోదం కోసమో, మరే కారణం చేతనో ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ముఖ్యంగా రైలు మీదకు ఎక్కడం, సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ కోసం వెర్రివేషాలు వేయడం, ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం అత్యంత హానికరం. అదృష్టం బాలేకపోతే కనురెప్పపాటులో ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఇదే జరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) దారుణ (Electrocution Tragedy) విషాద ఘటన జరిగింది. ట్రైన్ పైకెక్కి నిలబడిన ఓ యువకుడు.. ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకి మాడి మసై పోయాడు. అందరూ చూస్తుండగా, క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. హైటెన్షన్ వైర్ తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also- Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం
శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ విచారకర ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చనిపోవడానికి ముందు యువకుడు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ట్రైన్ టాప్ మీదకు ఎక్కి నిలబడడం వీడియోలో కనిపించింది. ప్లాట్ఫామ్పై జనాలు కిందకి దిగాలని, లేదంటే చనిపోతావంటూ హెచ్చరించారు. కిందకు దిగు లేదంటే చనిపోతావంటూ ఓ వ్యక్తి రెండుసార్లు హెచ్చరించడం వీడియోలో వినిపించింది. అయినప్పటికీ ఆ యువకుడు పెడచెవిన పెట్టాడు. పైగా ఎవరి మాట వినకుండా ట్రైన్పై రెండు అడుగులు ముందుకెళ్లాడు. అడుగులు వేసే సమయంలో కాస్త వంగినడిచిన అతడు.. నిటారుగా నిలబడ్డాడు. దీంతో, ట్రైన్కు విద్యుత్ సరఫరా చేసే ఓవర్హెడ్ వైర్ను అతడి శరీరం తాకింది. దీంతో, ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. రెప్పపాటులోనే ఆ యువకుడి శరీరం కదలకుండా హైటెన్షన్ వైర్లకు అతుక్కుపోయింది. ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ట్రైన్ మీద నుంచి కింద పడిపోయి మృతి చెందాడు.
అయితే, మృతి చెందిన యువకుడికి మానసికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా?, లేక సోషల్ మీడియా వీడియో (రీల్) కోసం ట్రైన్ పైకి ఎక్కి ఇలా చేశాడా? అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. కాగా, విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్ల గుండా వెళ్లే రైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా విషాదమయంగా మారే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం జీవితాలను పణ్ణంగా పెట్టడం ఏమాత్రం సబబు కాదు. సరదా కంటే సురక్షితమే ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరి భద్రత వారి చేతుల్లో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.
Read Also- Sushila Karki: నేపాల్కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం
కాగా, రైళ్లు నడవడానికి ఉపయోగించే హైటెన్షన్ వైర్లు (Overhead Electric Wires) ద్వారా విద్యుత్ హై వోల్టేజ్తో (high voltage) ప్రవహిస్తుంది. సాధారణంగా భారతీయ రైల్వేలో ఈ హైటెన్షన్ లైన్లు 25,000 వోల్ట్స్ విద్యుత్ సరఫరా చేస్తాయి. ఈ అధిక వోల్టేజ్ విద్యుత్ రైళ్ల ఎలక్ట్రిక్ మోటార్లకు పవర్ అందిస్తుంది.