Sugar Mill: విస్తారంగా వ్యవసాయం కొనసాగే హర్యానాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వరదలు కూడా ముంచెత్తాయి. అయితే, ఈ వర్షం ధాటికి యమునానగర్లోని సరస్వతి షుగర్ మిల్లులోకి (Sugar Mill) వరదలు వెళ్లాయి. దీంతో, ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయిన ఈ కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది. ఏకంగా రూ.50 నుంచి రూ.60 కోట్ల విలువైన చక్కెర తడిసిపోయి కరిగింది. కంపెనీలో నిల్వ చేసిన మొత్తంలో దాదాపు 40 శాతం మేర నష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం అంచనా వేస్తోంది.
Read this- Pashamylaram Blast: పాశమైలారం ఘటన.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
కంపెనీకి చెందిన గిడ్డంగిలో 2,20,000 క్వింటాళ్ల పంచదార నిల్వ ఉందని, దీని విలువ రూ.97 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షపు నీటితో పాటు, సమీపంలోని డ్రైనేజీ నుంచి కూడా వరద పొంగి ప్రవహించడంతో వరదలు సంభవించాయని కంపెనీ అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన డ్రైనేజీన్ కంపెనీ గిడ్డంగి వెనుక వైపు నుంచి వెళుతుందని సరస్వతి షుగర్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా చెప్పారు. ఆక్రమణల కారణంగా డ్రైనేజీ మూసుకుపోయిందని, పర్యావసానంగా వరద నీరు చక్కెర మిల్లులోకి చేరిందని ఆయన వాపోయారు.
Read this- Producer Sireesh: హీరోల కంటే అతనే బెటర్ అంటూ గేమ్ ఛేంజర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
‘‘సోమవారం రాత్రి చాలా పెద్ద వర్షం కురిసింది. షుగర్ మిల్లు ప్రాంగణంలోకి వరద వస్తోందంటూ అర్ధరాత్రి సమయంలో మా సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని అలర్ట్ చేశారు. ఆక్రమణల కారణంగా డ్రైనేజీలోని వరదలు పైకి పొంగాయి. చక్కెర అధిక తేమను గ్రహించే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే, వరదలకు పంచదార ప్రభావితమైంది. దాదాపు రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకు విలువైన పంచదారను నష్టపోయాం. కంపెనీ గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితమైన నష్టాన్ని అంచనా వేయగలం’’ అని మిశ్రా వివరించారు. సరస్వతి షుగర్ మిల్లు వరదల్లో మునిగిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు.
ఇంతకుముందెప్పుడూ ఇలాంటి వరదలు చూడలేదని రాజీవ్ మిశ్రా వివరించారు. కంపెనీ అధికారులు ప్రస్తుతం క్రేన్ను ఉపయోగించి మిల్లులోని నీటిని తోడేస్తున్నారని, ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. కాగా, సరస్వతి షుగర్ ఫ్యాక్టరీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లినప్పటికీ, స్థానిక మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఉన్నతాధికారుల ఇదే నిర్లక్ష్యపూరిత వైఖరిని కొనసాగిస్తే మాత్రం ఆర్థికంగానే కాకుండా, కొంతస్థాయి వరకు ఆహార కొరత ఏర్పడి సవాలుగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read this- Madhya Pradesh: ఆస్పత్రిలో ఘోరం.. యువతి ఛాతిపై కూర్చొని.. కసిగా గొంతు కోసిన ఉన్మాది!