Siraj: లండన్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ నిర్ణయాత్మక 5వ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినప్పటికీ.. భారత్ ఏమాత్రం తడబాటు లేకుండా ఆడుతోంది. మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Siraj) అదరగొట్టడమే ఇందుకు కారణంగా ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 4 వికెట్లు తీసిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో శనివారానికి పడిన ఏకైక వికెట్ పడగొట్టాడు. అద్భుతమైన యార్కర్తో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు.
సిరాజ్ ప్రదర్శన కేవలం ఈ ఒక్క మ్యాచ్కే పరిమితం కాలేదు. ఈ సిరీస్లో బుమ్రా విశ్రాంతి తీసుకున్న రెండో టెస్టులో కూడా సిరాజ్ విజృంభించాడు. ఆ మ్యాచ్లో లేకపోయినా ఆ లోటు తెలియకుండా చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. దీంతో, ఐదో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అడిగిన పలు ప్రశ్నలకు సిరాజ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
దినేష్ కార్తిక్ ప్రశ్న ఇదే…
‘‘టీమిండియా బుమ్రా ఉన్నప్పుడు ఎలా ఆడుతోంది, అతడు లేనప్పుడు ఎలా ఆడుతోందనేది గమనిస్తే.. బుమ్రా లేనప్పుడు నువ్వు ముందుండి బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్నావు. నువ్వు చాలా మెరుగైన ప్రదర్శన చేస్తున్నావు. బుమ్రా జట్టులో ఉన్నప్పటికి లేనప్పటికి ఎందుకు ఇంత తేడా ఉంటుంది?. బుమ్రా లేనప్పుడు నీకు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం వస్తోందా?. టైలెండర్స్కి బౌలింగ్ చేసే ఛాన్స్ వస్తోందా?. నీ బౌలింగ్ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. బుమ్రా టీమ్లో ఆడడంపై నీ అభిప్రాయం ఏంటి?’’ అని దినేష్ కార్తీక్ ప్రశ్నించాడు.
Read Also- Siraj-Bumrah: బుమ్రాను ఒక ప్రశ్న అడిగిన మహ్మద్ సిరాజ్.. సమాధానం ఇదే
సిరాజ్ సమాధానం ఇదే…
మహ్మద్ సిరాజ్ తన భావోద్వేగాలను ఎప్పుడూ దాచుకోడుదు. ఈసారి కూడా ఏది దాచకుండా తన మనసులో మాట స్పష్టంగా చెప్పాడు. తనను ఉత్తమంగా ఆడించేది కేవలం ‘బాధ్యత’ అని స్పష్టం చేశాడు. ‘‘బాధ్యతను నేను చాలా ఇష్టపడతాను. జస్సీ భాయ్ని (బుమ్రా) మిస్ అవుతున్నాను. ఎందుకంటే, అతడు చాలా సీనియర్ బౌలర్. అయితే, నాకు బాధ్యత అప్పగించినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. బాధ్యతలను నెరవేర్చడాన్ని ఆనందంగా ఫీలవుతాను. ఎక్కువ ప్రెషర్ తీసుకోను. నా సింపుల్ ప్రణాళికలను ఫాలో అవుతూ బౌలింగ్ చేస్తాను’’ అని సిరాజ్ సమాధానం ఇచ్చాడు.
Read also- Meenakshi natrajan: బీజేపీ పాలనలో పేదల ఓట్లు గల్లంతు.. మీనాక్షి నటరాజన్!
కాగా, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్ట్ 4వ రోజు ముగిసే అవకాశాలు లేకపోలేదు. మ్యాచ్లో విజేత ఎవరో ఆదివారమే తేలే అవకాశం ఉంది. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 324 పరుగులు సాధించాలి. ఆతిథ్య జట్టు చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. భారత్ గెలవాలంటే ఆ తొమ్మిది వికెట్లను పడగొట్టాల్సి ఉంది. దీంతో, నాలుగవ రోజు ఆటలో మహ్మద్ సిరాజ్ అత్యంత కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ మ్యాచ్ను టీమిండియా గెలుచుకుంటే సిరీస్ 2-2తో సమం అవుతుంది.