Siraj-Bumrah: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా జరుగుతోంది. శనివారం నాడు మూడవ రోజు కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని ఒకానొక దశలో అనిపించింది. అయితే, టీమిండియా స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పెద్దగా ఆధిక్యం సాధించలేకపోయింది. మొత్తంగా చూస్తే, రెండవ రోజు ఆటలో భారత బౌలర్లదే పైచేయి అయింది. రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత సిరాజ్, ప్రసిద్ కృష్ణలపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
ఈ సందర్భంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్… బీసీసీఐతో వీడియో చాటింగ్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రాతో ఫన్నీ సంభాషణ జరిపినట్టు (Siraj-Bumrah) వెల్లడించాడు. ‘‘ ఎందుకు వెళ్తున్నావు? అని నేను జస్సీ భాయ్ని అడిగాను… నువ్వు వెళ్తే ఎలా? నేను ఐదు వికెట్లు తీసినప్పుడు ఆలింగనం చేసుకునేవారు ఎవరు?’ అని అన్నాడు. అప్పుడు బుమ్రా స్పందిస్తూ.. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు 5 వికెట్లు తియ్యమన్నాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైనా ఐదవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. దీంతో, జట్టు నుంచి అతడిని బీసీసీఐ రిలీవ్ చేసింది. దీంతో స్వదేశానికి వచ్చేశాడు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read Also- Rahul Gandhi: దివంగత నేత అరుణ్ జైట్లీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
కాగా, బుమ్రాపై శారీరక అలసట తగ్గింపు ప్రణాళికలో భాగంగా ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో మూడింట్లో ఆడేయంతో కెన్నింగ్టన్ ఓవల్ మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించింది. అందుకే, ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున టీమ్తో పాటు బుమ్రా కనిపించలేదు. దీనిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐదవ మ్యాచ్కు తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత జట్టు నుంచి బుమ్రాను రిలీజ్ చేశామని తెలిపింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
కాగా, ఇంగ్లండ్ టూర్ ప్రారంభానికి ముందే భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో బుమ్రా మూడు టెస్టులకు మించి ఆడబోడని స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే లీడ్స్లోని హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్, లార్డ్స్లో జరిగిన మూడో టెస్టు, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఆడాడు. దీంతో, చివరి టెస్టులో ఆడించలేదు. బుమ్రా ఫిట్నెస్ను కాపాడేందుకు బీసీసీఐ ఈ ప్రణాళికను అనుసరిస్తోంది.
Read Also- Viral News: మొగుడి హత్యకు భార్య పక్కా ప్లాన్.. అడవిలో బిగ్ ట్విస్ట్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్లో మూడు టెస్టుల్లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో 26 సగటు వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మంచి ఫామ్లో ఉండడం, సిరీస్ను సమం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బుమ్రాను ఆడిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు.