Shubman Gill: బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఆటకు చివరి రోజైన ఆదివారం భారత్ విజయానికి 7 వికెట్లు అవసరమవ్వగా, ఇంగ్లండ్ గెలవాలంటే ఏకంగా 536 పరుగులు సాధించాల్సి ఉంటుంది. టీమిండియా 608 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించగా, ఈ స్థాయి లక్ష్యాన్ని సెట్ చేయడంలో టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ మాదిరిగానే, రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా గిల్ తన అద్భుత ప్రదర్శన కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్లో 269 పరుగుల భారీ స్కోర్ సాధించిన కెప్టెన్, రెండవ ఇన్నింగ్స్లో కూడా 161 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శన క్రమంలో కెప్టెన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వాటిలో ఒక రికార్డు 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి నమోదయింది. ఒక టెస్ట్ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో పాటు మరో ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా గిల్ చరిత్ర తిరగరాశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ బ్యాటరూ ఈ రికార్డు సాధించలేదు.
Read Also- Samantha:18 ఏళ్ల వయస్సులోనే అతనితో సమంత మొదటి పెళ్లి? .. నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకుందా?
గిల్ సాధించిన మరిన్ని రికార్డులివే
ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి శుభ్మన్ గిల్ మొత్తం 430 పరుగులు బాదాడు. 1990లో భారత్పై గ్రాహం గూచ్ సాధించిన 456 పరుగుల తర్వాత ఒక టెస్ట్లో రెండవ అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇక, 1980లో పాకిస్థాన్పై అలన్ బోర్డర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులు సాధించాడు. ఒక టెస్ట్లో రెండు సార్లు 150కి పైగా స్కోర్లు సాధించిన రెండవ బ్యాట్స్మన్గా గిల్ నిలిచాడు.
ఒక టెస్టు మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో గిల్ ఒకడు. భారత బ్యాటర్లలో సునీల్ గవాస్కర్ తర్వాత గిల్ మాత్రమే ఉన్నాడు. శుభ్మాన్ గిల్ కంటే ముందు ఒక టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన భారత కెప్టెన్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. 1978లో వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ 107, 182 (నాటౌట్)గా రాణించాడు. ఇక, 2014లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 115, 141 పరుగుల చొప్పున రెండు ఇన్నింగ్స్లో శతకాలు బాదాడు.
Read Also- Sanju Samson: ఫ్రాంచైజీ మారిన శాంసన్.. రికార్డులు బ్రేక్ చేసిన ధర
ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో రిషబ్ పంత్ సరసన గిల్ నిలిచాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ సిరీస్ తొలి టెస్ట్లోనే పంత్ ఈ ఘనత సాధించాడు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి భారత్ మొత్తం 1,014 పరుగులు సాధించాడు. ఒక టెస్ట్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. అంతకుముందు 2004లో ఆస్ట్రేలియాపై నమోదు చేసిన 916 పరుగుల స్కోర్ను టీమిండియా అధిగమించింది. అంతర్జాతీయ క్రికెట్ పరంగా టీమిండియా సాధించింది నాలుగవ అత్యధిక స్కోరు. ఒక జట్టు ఒక టెస్ట్లో 1000 కంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది ఆరోసారి మాత్రమే. ఒక టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 100 పరుగులు, మరో ఇన్నింగ్స్లో 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జంట శుభ్మాన్ గిల్- రవీంద్ర జడేజా నిలిచారు.