Viral video: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే దిల్లీ భారీ వర్షాల నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దిల్లీలోకి నయాగరా జలపాతం వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే భారీ వర్షాల నేపథ్యంలో దిల్లీలోని ఓ మెట్రో స్టేషన్ జలపాతాన్ని తలపించింది. రోడ్డు మీద నుంచి దిల్లీ మెట్రోలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అండర్ గ్రౌండ్ మెట్ల మార్గాన్ని నలువైపుల నుంచి వర్షపు నీరు ముంచెత్తింది. వాటి మధ్య గుండా ఓ వ్యక్తి నడుస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాలను పోస్ట్ చేసిన హర్ష్ గోయంకా అనే వ్యక్తి ఫన్నీగా క్యాప్షన్ పెట్టారు. ‘నయాగరా ఫాల్స్ ను మర్చిపోండి. దిల్లీ మెట్రోలోని ఈ వాటర్ ఫాల్స్ ను వీక్షించండి. ఫ్రీ షవర్ తో పాటు స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. మెట్రో టికెట్ తీసుకుంటే చాలు సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయి’ అంటూ రాసుకొచ్చారు.
Forget Niagara Falls.
Just take the metro in Delhi – you’ll get waterfalls, a free shower, and maybe even a swim- all included in the ticket price. pic.twitter.com/w5VvTXCoO6— Harsh Goenka (@hvgoenka) September 4, 2025
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘దిల్లీ ప్రతీసారి అదనపు సేవలు అందిస్తుందని మరోమారు రుజువైంది’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘దిల్లీ మెట్రో.. ప్రజా రవాణా కాదు. ఇది రైళ్లు ఉన్న ఒక నీటి పార్క్’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరొకరు స్పందిస్తూ.. ‘దిల్లీ మెట్రో స్టేషన్ కు వెళ్లండి. ఒక అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అంటూ మరొకరు పోస్ట్ చేశారు. ‘దిల్లీ మెట్రో.. దేశంలో మెుట్టమెుదటి అండర్ వాటర్ థీమ్ పార్క్’ అని ఇంకొకరు రాశారు.
ఉప్పొంగిన యమునా నది
భారీ వర్షాల కారణంగా దిల్లీకి అనుకొని ఉన్న యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం ఒంటి గంటకు యమునా నది నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటింది. రాత్రి 10 గంటల సమయానికి ఇది 207.43 మీటర్లకు చేరింది. 1963 తర్వాత యమునా నది నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడోసారి. మరోవైపు వరదల కారణంగా దిల్లీలోని రింగ్ రోడ్డు, సివిల్ లైన్స్, బేలా రోడ్డు, సోనియా విహార్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద నీరు కారణంగా మజ్ను కాటిల్లా, సలీంగర్ బైపాస్ మధ్య ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిగంబోధ్ ఘాట్, గీతా కాలనీలోని దహన సంస్కారాలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలిపివేసింది.
Also Read: Srisailam Dam: డేంజర్లో శ్రీశైలం ప్రాజెక్ట్.. 2 గేట్లకు లీకేజీలు.. భద్రతపై తీవ్ర ఆందోళనలు
దిల్లీలో వచ్చే 3 రోజులు వర్షాలే!
దిల్లీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 3 మధ్యాహ్నం ఒంటి గంటకు నీటి మట్టం 207 మీటర్ల ఎత్తు వరకు పెరిగింది. వాతావరణ సూచన ప్రకారం దిల్లీలో ఇవాళ కూడా పిడుగులతో కూడిన వర్షం కురవనుంది. సెప్టెంబర్ 5న మోస్తరు వర్షాలు, 6న పిడుగులతో కూడిన వర్షం, 7-8 తేదీల్లో సాధారణ మేఘావృత వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది.