Telegram App: టెలిగ్రామ్ యాప్.. పరిచయం అక్కర్లేని మెసేజింగ్ యాప్. నిత్యం లక్షలాది మంది వాడుతున్న ఈ యాప్ సైబర్ క్రిమినల్స్కు వరంలా మారింది. గ్రూప్లో పోస్ట్ అయ్యే మెసేజీల తనిఖీ లేకపోవటం. తేలికగా ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశం ఉండటం. నిర్ణీత వ్యవధికొకసారి ఆటోమేటిక్గా చాట్స్ డిలీట్ అవుతుండటమే దీనికి ప్రధాన కారణాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఈ యాప్ను ఉపయోగించుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వారిని ట్రాక్ చేయడం చాలా కష్టమని అంటున్నారు. అందుకే టెలిగ్రామ్ యాప్ను కేటుగాళ్లు తమ మోసాలకు వేదికగా చేసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఒకటైన టెలిగ్రామ్ యాప్కు జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
సైబర్ క్రిమినల్స్ అవకాశం
నిత్యం లక్షలాది మంది ఈ యాప్ను ఉపయోగించుకుంటున్నారు. సరిగ్గా దీనినే సైబర్ క్రిమినల్స్ అవకాశంగా చేసుకుంటున్నారు. క్యాసినో, క్రికెట్ తదితర బెట్టింగ్ యాప్లను టెలీగ్రామ్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించుకోండి అని ఊరించి వేలాది మందిని ఉచ్ఛులోకి లాగుతూ లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. టార్గెట్గా చేసుకున్న వారిని నమ్మించడానికి మొదట కొంత లాభాలు వచ్చినట్టుగా చూపించి ఆ తరువాత ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇక, ఫేక్ ప్రొఫైల్స్తో టెలిగ్రామ్ యాప్లు ఐడీలు క్రియేట్ చేసుకుంటూ మరికొందరు మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ముందు రిక్వెస్టులు పెట్టి ఫ్రెండ్స్లా మారి కొన్ని రోజులు చాటింగ్ చేస్తూ సన్నిహితంగా మారుతున్నారు.
Also Read: WhatsApp: వాట్సప్, మెసేజింగ్ యాప్లకు DoT షాక్.. 6 గంటల తర్వాత లాగ్ అవుట్ చేయాల్సిందే!
డబ్బు కోసం బ్లాక్ మెయిల్
ఆ తరువాత ఫొటోలను షేర్ చేయించి వాటిని అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. అనంతరం డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తూ డబ్బు గుంజుతున్నారు. ఇక, యువతుల ఫొటోలు, పేర్లతో ఐడీలు క్రియేట్ చేస్తున్న మరికొందరు యువకులను హనీట్రాప్లోకి లాగుతూ లక్షలు కొల్లగొడుతున్నారు. ఇటీవల పాతబస్తీ యాఖుత్పురాకు చెందిన ఓ యువకుడికి ఇలాగే టోకరా ఇచ్చారు. అందమైన యువతి కావాలా? అయితే, సంప్రదించండి అంటూ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆ యువకుడికి కొన్ని ఫొటోలు పంపించారు. వాటిని చూసి యువకుడు వలలో చిక్కుకోగా అడ్వాన్స్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ, రూం రిజర్వేషన్ ఛార్జీ పేర రోజుల్లోనే లక్ష రూపాయలను వేర్వేరు అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించి కొట్టేశారు. అప్పుడుగానీ మోసపోయినట్టు బాధితుడికి తెలియలేదు. విషయం తెలిసిన తరువాత హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డ్రగ్స్ దందా
ఇక, టెలిగ్రామ్ యాప్ను వేదికగా చేసుకుని కొందరు ఏకంగా డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొకైన్, గంజాయి, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ ఇలా అన్నిరకాల మాదక ద్రవ్యాల ఫొటోలను షేర్ చేస్తూ మత్తులో మజా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కాంటాక్ట్ చేయండి అని ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. సంప్రదించిన వారి నుంచి వేర్వేరు అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు.
Also Read: Bihar Crime: చోరీలలో ఇదో వెరైటీ.. గోల్డ్ రింగ్స్ మింగేసి మరీ..

